అవసరమైతే ఉక్కును మూసేస్తారా ?

తాజాగా కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ మాటలను బట్టి అందరికీ అదే అర్ధమవుతోంది. ఒడిస్సాలో బీజూ జనతాదళ్ పార్టీ ఎంపి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి పార్లమెంటులో సమాధానమిస్తు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు సంస్ధలకు అమ్మేయటానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన విషయాన్ని స్పష్టంచేశారు. ప్రభుత్వం పెట్టుబడులను ఉపసహరించేందుకు కేంద్రం రెండు విధాలుగా వర్గీకరించినట్లు చెప్పారు.

స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ అనే రెండంచెల విధానాన్మని కేంద్రం అమలు చేస్తోందన్నారు. నాన్ స్ట్రాటజిక్ రంగంలోని ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించాలని తీసుకున్న నిర్ణయమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకూ వర్తిస్తుందన్నారు. ఒకవేళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సాధ్యం కాకపోతే మూసేయటానికి కూడా కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంటే ఠాకూర్ ప్రకటనలో అర్ధమవుతున్నదేమంటే అమ్ముడుపోకపోతే ఉక్కును మూసేస్తామే కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేది లేదని కుండబద్దలు కొట్టారు.

కేంద్రం తీసుకున్న నిర్ణయమే నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా కేంద్రం ఎందుకు ఆలోచించకూడదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుండి కేంద్రం తన పెట్టుబడులను ఉపసంహరించాలని అనుకున్నపుడు ఫ్యాక్టరీని రాష్ట్రప్రభుత్వానికి అప్పగించమని ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాసున్నారు. కేంద్రం ఫ్యాక్టరీని నిర్వహించే ఉద్దేశ్యం లేనపుడు విశాఖ ఉక్కును ముందుగా రాష్ట్రప్రభుత్వానికి అప్పగించటమే మంచిది.

కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రప్రభుత్వం స్పందికపోతే అప్పుడు తనిష్టం వచ్చినట్లుగా ప్రైవేటు సంస్ధలకు అప్పగించే యోచన చేయటంలో తప్పులేదు. అయితే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీని తీసుకోవటానికి రాష్ట్రప్రభుత్వం సిద్దంగా ఉంది. అయితే కండీషన్ ఏమిటంటే ముడిఇనుము ఖనిజాలను కేంద్రం అప్పగించాలి. ఎందుకంటే విశాఖ ఉక్కుకు అంతర్జాతీయస్ధాయిలో మంచి పేరుంది. కాకపోతే సొంతానికి ఇనుప ఖనిజాలు లేనందు వల్లే ముడిఇనుము కొనుగోలుకు ఎక్కువ ధరలు పెడుతోంది. దీనివల్ల ఆర్ధికభారంపడి నష్టాల్లో ఉంది. మొత్తానికి అవసరమైతే విశాఖ ఉక్కును మూసేయటానికి కూడా రెడీగా ఉందని అర్ధమవుతోంది.