వైసీపీ-కరణం మధ్య ఏం జరుగుతోంది ?

ఇపుడిదే జిల్లాలో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ తరపున 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే గెలిచారు. వీరిలో ప్రకాశం జిల్లాలోని కరణం బలరామ్ కూడా ఒకరు. ఈయన చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ మీద సుమారు 30 వేల మెజారిటితో గెలిచారు. దశాబ్దాల పాటు టీడీపీతో అనుబంధం ఉన్న కరణం పార్టీని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే టీడీపీకి భవిష్యత్తులేదన్న ఉద్దేశ్యంతో.

అయితే నేరుగా వైసీపీలో చేరలేదు. తన కొడుకు కరణం వెంకటేష్ తో పాటు మరికొందరిని అధికారపార్టీలోకి పంపారు. తాను ప్రత్యక్షంగా చేరకపోయినా వైసీపీతోనే అంటకాగుతున్నారు. ఇక్కడే సమస్యలు మొదలయ్యాయి. ఈయన నేరుగా వైసీపీలో చేరకపోవటంతో అధికారపార్టీ నేతలు, క్యాడర్ ఎంఎల్ఏతో కలవలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈయన వైసీపీతో తిరుగుతున్న కారణంగా టీడీపీ నేతలు, క్యాడర్ తో దూరం పెరిగిపోయింది.

ఇక్కడే కరణం వ్యవహారంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు కరణంకు టీడీపీని వదిలేసే ఆలోచన ఉందా ? అన్నదే అసలైన సందేహం. ఎందుకంటే టీడీపీకి ఎంఎల్ఏకి మధ్య బలమైన సామాజికబంధం ఉంది. ఎంఎల్ఏ వైసీపీ నేతలతో తిరుగుతున్నా క్యాడర్ మాత్రం ఈయన్ను పట్టించుకోవటం లేదు. క్యాడర్ కు ఏదైనా అవసరం అయితే ఆమంచి దగ్గరకు వెళుతున్నారే కానీ కరణం దగ్గరకు వెళ్ళటం లేదు. వైసీపీలో పూర్తిగా చేరని కారణంగా ఎంఎల్ఏ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు.

వ్యక్తిగతంగా కరణంతో సన్నిహితులైన వాళ్ళంతా ఇంకా టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. కొడుకును వైసీపీలో చేర్చారు. తన సన్నిహితుల్లో చాలామంది ఇంకా టీడీపీలోనే ఉన్నారు. తాను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయలేదు. అలాగని టీడీపీతో కాకుండా వైసీపీ నేతలతో తిరుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే కరణం రెండు పడవలపైనా ప్రయాణం చేస్తున్నారా ? అనే అనుమానం పెరిగిపోతోంది. వ్యూహాత్మకంగా అవసరాల కోసమే వైసీపీకి దగ్గరయ్యారా ? అనే టాక్ కూడా పెరిగిపోతోంది. మొత్తానికి వైసీపీ-కరణం మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలైతే పెరిగిపోతున్నాయి.