ఫ్యాక్ట్ చెక్ .. వాటెన్ ఐడియా జగన్ జీ

మీడియా మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నంత కాలంలో అసత్యాల ప్రచారం చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిందో.. లెక్కలు పూర్తిగా మారిపోయాయి. నిజాల కంటే అబద్ధాల ప్రచారమే ఎక్కువైంది. అసత్యాల్ని సత్యాలుగా భ్రమించేలా పోస్టులు సిద్ధం చేయటం.. ఆడియో.. వీడియోలను తమకు అనుకూలంగా మార్ఫింగ్ చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. అందరూ అసత్యాల ప్రచారానికి బలి అవుతుంటారు. ఇలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

తాజాగా ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ను తీసుకొచ్చారు. దాని ట్విట్టర్ ఖాతాను కూడా తాజాగా ప్రారంభించారు. మీడియాలో.. సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్న వాటికి సంబంధించిన తప్పుడు వివరాల్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందట. సాక్ష్యాధారాలతో సహా నిజం చూపిస్తారని… నిజం ఏమిటో.. అబద్ధం ఏమిటో చూపించటమే ఏపీ ఫ్యాక్ట్ చెక్ ముఖ్య ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు.

ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేపడితే.. అదెక్కడి నుంచి మొదలైందో గుర్తించి.. దానిపై చట్టప్రాకరం చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఒక వ్యక్తి ప్రతిష్ఠను.. వ్యవస్థ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదని.. వ్యవస్థలను తప్పుదోవ పట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే కార్యక్రమాలపైనా. వ్యవస్థలపైనా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పలు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అలాంటి వాటికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతో తామీ వేదికను సిద్ధం చేసినట్లుగా సీఎం జగన్ చెప్పారు. అసత్యాల్ని ప్రచారం చేసే వారికి ఇక చుక్కలే.