తేయాకు కార్మికురాలిగా మారిపోయిన ప్రియాంక

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు తెగ కష్టపడుతున్నారు. అస్సాం ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు తేయాక కార్మికురాలి అవతారం ఎత్తింది. అస్సాంలోని బిశ్వనాధ్ టీ గార్డెన్లోని కార్మికులతో కలిసిపోయి తేయాకును తెంపారు. దీని కోసం కార్మికుల లాగే నుదిటికి బ్యాండ్ కట్టుకుని, భుజం మీదుగా వీపుకు పెద్ద బుట్ట పెట్టుకుని, నడుముకు ఏప్రాన్ చుట్టుకుని తేయాకు తోటల్లో కార్మికులతో కలిసిపోయారు.

అస్సాంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రియాంక ఒక్కతే కష్టపడుతున్నారు. ఒకపుడు తరుణ్ గొగోయ్ ఉన్నపుడు పార్టీకి మంచి ఆధరణుండేది. కానీ తర్వాత పార్టీ ప్రాభవం దెబ్బతినేసింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే నినాదంతో ప్రధాన కార్యదర్శి అస్సాంలో తెగ తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే తేయాక కార్మికులపై తన దృష్టిని సారించారు.

తేయాకు కార్మికుల మెరుగైన భవిష్యత్తుకు ప్రియాంక చాలా హామీలే ఇచ్చారు. తేయాకు కార్మికులతో కలిసి పనిచేయటం ద్వారా వారి జీవన విధానాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నించానన్నారు. తాము పడుతున్న కష్టాలను కార్మికులు తనకు వివరించారని ప్రియాంక తర్వాత తన ట్విట్టర్లో వివరించారు. తనపై మహిళా తేయాకు కార్మికులు చూపించిన అభిమానాన్ని ఎన్నటికీ మరచిపోలేనంటు ట్వీట్ చేశారు.

తేయాకు తోటలు, కార్మికులపై ప్రియాంక ఎందుకింతగా దృష్టి పెట్టారంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈనెల 27 నుండి మూడు విడతల్లో అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి. 124 అసెంబ్లీ సీట్లలో సుమారు 37 నియోజకవర్గాల్లో తేయాకు కార్మికుల ఓట్లే గెలుపోటములను శాసిస్తాయి. అంటే వీరు ఎవరికైతే గంపగుత్తగా మద్దతుగా నిలబడతారో వాళ్ళకే గెలుపు అవకాశాలుంటాయి. ఈ కారణంగానే నరేంద్రమోడి కూడా వీళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి తేయాకు కార్మికులు ఎవరికి మద్దతిస్తారో చూడాలి.