అంత గొడవ చేస్తే కానీ ఎల్జీ పాలిమర్స్ స్పందించలేదు

విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి రెండు రోజుల కిందట స్టెరీన్ గ్యాస్ లీక్ కావడం.. పన్నెండు మంది ప్రాణాలు కోల్పోవడం.. వందల మంది అస్వస్థతకు గురవడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. చనిపోయిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారికి కూడా ఆర్థిక సాయం ప్రకటించారు.

ఐతే ఇంతటి విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి మాత్రం ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కూడా ఎలాంటి ప్రకటన లేదు. అసలీ ప్రమాదం ఎలా చోటుచేసుకుందో వివరణ లేదు. బాధితులకు సంతాపం ప్రకటించలేదు. వారికి పరిహారం ఏం ఇస్తారో చెప్పలేదు. ప్లాంటులో మళ్లీ ప్రమాదం చోటు చేసుకోకుండా చేపడుతున్న చర్యల గురించి కూడా వివరించలేదు.

కంపెనీ తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత ప్రజలు శనివారం ఉదయం కంపెనీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గ్యాస్ లీక్ ఉదంతంతో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలతో వాళ్లు ఆందోళన నిర్వహించడం గమనార్హం. తక్షణం ప్లాంటును మూసేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంత జరిగాక కానీ ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఈ ఉదంతంపై ఒక ప్రెస్ నోట్ ఇవ్వలేదు.

స్టెరీన్ గ్యాస్ నిల్వ ఉంచిన చోటి నుంచి ఆవిరి బయటికి రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. అప్పటి నుంచి దాన్ని అదుపు చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నామని.. ఇప్పుడు పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఎల్జీ సంస్థ ప్రకటించింది. ఈ ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని.. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేస్తామని.. అస్వస్థతతో బాధ పడుతున్న వాళ్లందరినీ కూడా ఆదుకుంటామని.. ప్రతి కుటుంబాన్ని ఎల్జీ సంస్థ కాంటాక్ట్ చేస్తుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఐతే బాధితులకు ఎంత పరిహారం ఇచ్చేది మాత్రం వెల్లడించలేదు.