పరువు నిలిపిన సొంత గ్రామం

మొత్తానికి పుట్టి పెరిగిన సొంత గ్రామం నారావారిపల్లే చంద్రబాబునాయుడు పరువు కాస్త నిలిపింది. నాలుగో విడతలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని అనేక పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. అయితే చంద్రబాబు పుట్టి పెరిగిన సొంతగ్రామం నారావారి పల్లె పంచాయితిలో మాత్రం టీడీపీ మద్దతుదారే గెలిచారు. ఇక్కడ తెలుగుదేశంపార్టీ మద్దతుదారు పోటీ చేసిన లక్ష్మి సమీప అభ్యర్ధిపై 563 ఓట్ల మెజారిటితో గెలిచారు.

నారావారి పల్లెలో వైసీపీ జెండా ఎగురవేయాలని అధికారపార్టీ నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు. వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ పంచాయితిలో గెలుపు కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా, ఎంతమంది నేతలను రంగంలోకి దింపినా ఇక్కడ టీడీపీ అభ్యర్ధే గెలవటం విశేషం. నియోజకవర్గంలోని చాలా పంచాయితీల్లో మళ్ళీ వైసీపీ మద్దతుదారులే గెలిచారు.

మొన్నటి మూడో విడత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయితీల్లో వైసీపీ మద్దుతుదారులే గెలిచారు. ఇక్కడ 89 పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులు 74 చోట్ల గెలిస్తే టీడీపీ గెలిచింది కేవలం 14 పంచాయితీల్లో మాత్రమే. కుప్పం నియోజకవర్గంలో ఏకంగా వైసీపీ 74 పంచాయితీల్లో గెలవటం గడచిన 30 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి. ఎన్నిక ఏదైనా సరే టీడీపీ తరపున ఎవరు నామినేషన్ వేసినా గెలుపు ఖాయమే అన్నట్లుండేది పరిస్దితి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్ధితుల్లో బాగా మార్పు వచ్చేసింది. మొత్తానికి కుప్పంలో పంచాయితీల్లో ఓడిపోయినా కనీసం పుట్టి పెరిగిన సొంత గ్రామపంచాయితీ నారావారి పల్లెలో అయినా టీడీపీ తన పట్టు నిలుపుకోవటం సంతోషించాల్సిన విషయమే. పంచాయితీ ఎన్నికల్లోనో లేకపోతే స్ధానిక ఎన్నికల్లోనో గెలిచినంత మాత్రాన ఏమీ అయిపోదు. పార్టీ పటిష్టానికి గ్రౌండ్ లెవల్ నుండి కష్టపడితే మళ్ళీ పార్టీ బలోపేతమవటం పెద్ద కష్టంకాదు.