చంద్రబాబులో మార్పు రాదా ?

ఎవరేమి చేస్తార్లే అని కౌంటింగును వదిలేశారు..మీకు చాలాసార్లు చెప్పాను న్యాయం కోసం పోరాడాలని..ఇది చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు. కుప్పంలో పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఘోర ఓటమిపై శనివారం చంద్రబాబు నియోజకవర్గంలోని నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో కుప్పానికి వచ్చి పరిస్దితిని చక్కదిద్దుతానని ధైర్యం చెప్పారు. అధికారపార్టీ నేతలు డబ్బులు వెదజల్లి, ధౌర్జన్యాలు చేసి, అధికార దుర్వినియోగంతో పంచాయితీ ఎన్నికల్లో గెలిచారని చంద్రబాబు కామెంట్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్నున్నాయి. అవేమిటంటే టీడీపీ మద్దతుదారుల ఓటమికి నేతలే కారణం. రెండోది అధికారపార్ట ధౌర్జన్యాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగంతో మాత్రమే గెలిచింది. మూడోదేమంటే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో చంద్రబాబు చెప్పినా నేతలు పట్టించుకోలేదు. టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు చెప్పిందిదే. చంద్రబాబు అనుసరించిన పద్దతి ఇపుడు కాదు మొదటినుండి ఇదే ధోరణి.

ప్లస్ వస్తే తన వల్లే..ఎక్కడైనా మైనస్ వస్తే నేతల వల్లే అని సింపుల్ గా తేల్చేస్తారు. ఇపుడు కూడా మద్దతుదారుల ఓటమికి నేతలదే తప్పని అంటున్నారు కానీ అధికారపార్టీ అనుసరించిన విధానాలు ఏమిటి ? వాళ్ళ బలాన్ని గుర్తించటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ప్రత్యర్ధి బలాన్ని గుర్తిస్తేనే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై కసరత్తు చేస్తాం. అలాకాదని ప్రత్యర్ధిపార్టి ఎందుకు పనికిరాదని అనుకుంటే మనకు మైనస్సే గతి.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు జనాల్లోకి బాగా వెళ్ళినట్లు స్వయంగా చంద్రబాబుకు మద్దతిచ్చే ఆంద్రజ్యోతే విశ్లేషించింది. దానికితోడు టీడీపీ నేతలు ఎన్నికలను పట్టించుకోలేదని, అధికారపార్టీ నేతలు పకడ్బందీగా ఎలక్షనీరింగ్ చేసుకోవటమే విజయానికి కారణమని చెప్పిన విషయాన్ని కూడా చంద్రబాబు అంగీకరించలేకపోతున్నారు. ఇక దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం, డబ్బులు వెదజల్లటం వల్లే వైసీపీ గెలిచిందని ఆరోపించటం వల్ల ఉపయోగమేంటి? అధికారంలో ఉన్నవాళ్లు అవి చేస్తారు. వాటిని ఎదుర్కోవడానికి ముందే సిద్ధంగా ఉండటంలో విఫలమైంది నిజం కాదా?

మొత్తానికి కుప్పం నేతలతో రివ్యు చూసిన తర్వాత చంద్రబాబులో మార్పు అంత సులువుగా రాదన్న విషయం అర్ధమైపోయింది.