నరేంద్రమోడికి లీగల్ నోటీసులు ?

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోవటంపై ప్రదానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అండ్ కో కు లీగల్ నోటీసులు ఇవ్వాలని ఏపీసీసీ లీగల్ సెల్ తీర్మానించింది. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా ఏపి డెవలప్మెంటుకు అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. అందులో ప్రత్యేకహోదా అనేది చాలా కీలకం. ఏపి అభివృద్ధికి ప్రత్యేకహోదాను ఐదేళ్ళ పాటు అమలు చేయనున్నట్లు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు.

అయితే రాజ్యసభలో అప్పటి బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతు ప్రత్యేకహోదా ఐదేళ్ళు చాలదు పదేళ్ళు కావాలని డిమాండ్ చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్నికలసమయంలో నరేంద్రమోడి, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగసభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు ప్రత్యేకహోదా పదేళ్ళు చాలదని 15 ఏళ్ళు కావాలని మోడికి సూచించారు.

సీన్ కట్ చేస్తే నరేంద్రమోడి ప్రధానమంత్రయ్యారు. వెంకయ్య కేంద్ర మంత్రయ్యారు. చంద్రబాబు సీఎం అయ్యారు. ఏపికి ప్రత్యేకహోదా వెసులుబాటును మోడి తుంగలో తొక్కారు. హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ద్వారా ప్రతిపాదించారు. దానికి చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇక ఈ విషయంలో చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలు అందరికీ తెలిసిందే. చివరకు తేలినదేమిటయ్యా అంటే అటు హోదా లేదు ఇటు ప్యాకేజీ లేదు.

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సందర్భం వచ్చినపుడల్లా ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతున్నారే కానీ మోడిపై ఒత్తిడి తేలేకపోతున్నారు. రాజకీయంగా ఏపిపై బీజేపీ ఆధారపడే పరిస్ధితి వస్తే మాత్రమే ప్రత్యేకహోదా వస్తుందేమో చూడాలి. ఇలాంటి పరిస్దితుల్లో ఏపీసీసీ లీగల్ సెల్ సమావేశంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, హోం శాఖ కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లీగల్ నోటీసులు పంపాలని డిసైడ్ చేసింది.

ఇదే విషయమై సుప్రింకోర్టులో కేసులు వేయాలని కూడా నిర్ణయమైంది. అసలు రాష్ట్ర విభజనే చెల్లదని ఇప్పటికే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రింకోర్టులో కేసు వేస్తున్నారు. అదేమైందో ఎవరికీ తెలీదు. విభజన జరిగిన ఇంత కాలానికి ప్రత్యేకహోదా విషయంలో న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మరి కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా ?