విశాఖ ఉక్కుపై కేంద్రం వెనక్కు తగ్గిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు అండ్ కో పదే పదే ప్రకటనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరుతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న ఆందోళనలను గమనించిన కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకున్నదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

విశాఖ ఉక్కుకు ధక్షిణకొరియాలోని పోస్కో సంస్ధకు మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయు) జరిగినట్లు స్వయంగా ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధానే స్పష్టంగా ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత విశాఖపట్నంలో ఆందోళనలు పెరిగిపోయాయి. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఏపి సీఎం లేఖ కూడా రాసిన విషయం అందరికీ తెలిసిందే. 2018 అక్టోబర్లోనే విశాఖ ఉక్కును పోస్కో కంపెనీకి అప్పగించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారమే 2019 అక్టోబర్లో ఎంవోయు జరిగిందని కూడా ధర్మేంద్ర చెప్పారు.

వాస్తవం ఇలాగుంటే బీజేపీ నేతలు మాత్రం కొత్త డ్రామాలకు తెరలేపారు. ఉక్కు పరిశ్రమ ప్రయోజనాల రక్షణ కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు అండ్ కో పదే పదే చెబుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశ్యమే కేంద్రానికి లేదని చెప్పటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా అధికార, ప్రతిపక్షాలు ఆందోళనల పేరుతో రాజకీయాలు చేస్తున్నట్లు వీర్రాజు ఎదురుదాడి మొదలుపెట్టడమే ఆశ్చర్యంగా ఉంది.

పైగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల నుండి జనాల దృష్టి మళ్ళించేందుకే అధికారపార్టీ ఉక్కు ఆందోళనలు మొదలుపెట్టించినట్లు విరుచుకుపడుతున్నారు. జరుగుతున్నది చూస్తుంటే ఆందోళనల కారణంగా కేంద్రం ఏమైనా తన నిర్ణయంలో వెనక్కు తగ్గుతోందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. ఏ యాజమాన్యమైనా ఓ ఫ్యాక్టరీని కానీ లేదా కంపెనీని టేకెనోవర్ చేసేటపుడు ఎటువంటి ఆందోళనలు జరగకూడదనే అనుకుంటుంది.

అయితే ఇక్కడ జరుగుతున్న ఆందోళనల కారణంగా పోస్కో యాజమాన్యంలో టెన్షన్ మొదలైనట్లు అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం తన నిర్ణయం విషయంలో వెనక్కు పోయిందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఆ విషయం చెప్పకుండా వీర్రాజు అండ్ కో మాత్రం ప్రైవేటీకరణ నిర్ణయమే ప్రకటించలేదని చెప్పటమే విడ్డూరంగా ఉంది. మొత్తానికి ప్రజాందోళనలకు కేంద్రం తలొంచిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు వీర్రాజు మాటలను కేంద్రం పట్టించుకుంటుందా ?