తమ్ముళ్ళ గొడవలో చంద్రబాబుకే షాకిచ్చిన కేశినేని

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకే విజయవాడ ఎంపి కేశినేని నాని షాకిచ్చారు. విజయివాడ మున్సిపల్ కొర్పొరేషన్ మేయర్ అభ్యర్ధి ఎంపిక గొడవలో పాత విషయాలన్నీ బయటకు వచ్చాయి. దాంతో మండిపోయిన ఎంపి గతంలో చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెట్టి వాయించేశారు. అప్పట్లో ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదాపడిన సమయంలో మేయర్ అభ్యర్ధిగా 39వ డివిజన్ అభ్యర్ధి పూజితను ఫోకస్ చేశారు.

అయితే తాజాగా మరో డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్ధి శివను ప్రకటించారట. పూజితేమో ఎంఎల్సీ బుద్ధా వెంకన్న క్యాండిడేట్ కాగా శివేమో ఎంపి మద్దతుదారుడు. దాంతో డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కాకుండా ఎంపి-ఎంఎల్సీ వర్గాల మధ్య గొడవ మొదలైపోయింది. దీంతో ఎంపి ఆఫీసు ముందే రెండువర్గాలు పెద్ద ఎత్తున గొడవకు దిగాయి. ఇంతకీ శివపై బుద్దా అండ్ కో ఆరోపణలు ఏమిటంటే గతంలో ఈ అభ్యర్ధి చంద్రబాబునాయుడుపైన తీవ్రమైన ఆరోపణలు చేశాడట.

పార్టీ అధినేతపైనే తీవ్రమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు ? చేర్చుకున్నా మేయర్ అభ్యర్ధిగా ఎలా ప్రకటిస్తారనేది బుద్ధా అండ్ కో ఎంపిని నిలదీశారు. దాంతో రెచ్చిపోయిన కేశినేని గతంలో చంద్రబాబు ప్రోత్సహించిన ఫిరాయంపులను ప్రస్తావించారు. వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను చంద్రబాబు ఫిరాయింపులకు ప్రోత్సహించి టీడీపీలోకి తీసుకురవాటం తప్పు కానపుడు ఇపుడు శివను తాను టీడీపీలోకి తీసుకురావటంలో తప్పేంటని గట్టిగానే ఎదురు తిరిగారు.

ఫిరాయింపు ఎంఎల్ఏలంరు వైసీపీలో ఉన్నపుడు చంద్రబాబుపైన ఎన్ని ఆరోపణలు చేసింది, ఎన్ని మాటలన్నది అందరికీ తెలిసిందే కదా అంటూ గతాన్ని తవ్వి తీశారు. దాంతో ఎంపి, ఎంఎల్సీల మధ్య అసలేమవుతుంది ? వీళ్ళ గొడవ మధ్యలో చంద్రబాబు నిర్వాకాలన్నీ బయటకు రావటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మధ్యలో ఉన్న వాళ్ళెవరో జోక్యం చేసుకుని ఇద్దరినీ వారించారు. దాంతో ఎంపి కాస్త తగ్గి తనపైన ఏమైనా ఫిర్యాదులుంటే పార్టీ అధినేతకు వెళ్ళి చెప్పుకోమని చెప్పటం గమనార్హం.