షాక్.. ఏపీ ఉద్యమ నేత చలసాని కుమార్తె సూసైడ్

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడినంతనే గుర్తుకు వచ్చే చలసానికి తీరని విషాదం కమ్మేసింది. ఆయన కుమార్తె శిరిష్మ తాజాగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.

గచ్చిబౌలికి దగ్గర్లోని ఓయూ కాలనీలో ఆమె నివిస్తుంటారు. 27 ఏళ్ల శిరిష్మకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్ తో వివాహమైంది. వారికి పిల్లల్లేరు. ఇంటీరియర్ డిజైనర్ అయిన ఆమె.. ఇటీవల కాలంలో తీవ్రమైన డిప్రెషన్ కు గురైనట్లుగా చెబుతున్నారు. పిల్లలు లేరన్న వేదనతో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించినట్లుగా చెబుతున్నారు. ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొన్న శిరిష్మను చూసిన ఆమె భర్త వెంటనే ఆమెను దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. చలసాని శ్రీనివాస్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత వేదన ఆమెకు ఎందుకు ఎదురైందన్నది ఇప్పుడు సంచలన అంశంగా మారింది.