బాబు కోట‌లో జ‌గ‌న్ పాగా వేసిన‌ట్టేనా?

కుప్పం… ఈ పేరు వింటేనే… టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడును 35 ఏళ్లుగా గెలిపిస్తూ వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గం మ‌న క్ల ముందు క‌ద‌లాడుతుంది. అంతేనా… టీడీపీకి కంచుకోట‌గా కుప్పంను ప‌రిగ‌ణిస్తాం క‌దా. అందుకే క‌దా… స్వ‌యంగా ప్ర‌చారానికి కూడా వెళ్ల‌కున్నా.. ఏడు ప‌ర్యాయాలుగా చంద్ర‌బాబు అక్క‌డ గెలుస్తూ వ‌స్తున్నారు. అలాంటి కుప్పంలో ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ వైసీపీ పాగా వేసింద‌నే మాట ఆస‌క్తి రేకిస్తోంది. చంద్ర‌బాబు సొంత నియోజ‌వ‌ర్గం ఏమిటీ? అందులో వైసీపీ అభ్య‌ర్థులు మెజారిటీ పంచాయ‌తీల్లో స‌ర్పంచ్ లుగా గెలుపొందడం ఏమిట‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తున్న అంశ‌మ‌ని చెప్పాలి.

ఏపీలో ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో మూడో విడ‌త ఎన్నిక‌ల్లో భాగంగా కుప్పం ప‌రిధిలోని పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎక్క‌డిక్క‌డ వైసీపీ శ్రేణులు బ‌ల‌వంత‌గా ఏక‌గ్రీవాలు చేసుకున్నా… చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంగా పేరున్న కుప్పంలో మాత్రం ఆ ఆట‌లు సాగ‌లేదు. కుప్పం ప‌రిధిలోని మొత్తం 89 పంచాయ‌తీల‌కు పోలింగ్ అనివార్యంగా మారింది. ఏక‌గ్రీవాల‌కు కుప్పంలో అవ‌కాశం లేక‌పోవ‌డంతో పోలింగ్ లో సత్తా చాటే దిశ‌గా వైసీపీ త‌న ప్లాన్ బీని అమ‌లులోకి తీసుకొచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఫ‌లితంగా మొత్తం 89 పంచాయ‌తీల‌కు గాను ఏకంగా 74 పంచాయ‌తీల్లో వైసీపీ అభ్య‌ర్థులే స‌ర్పంచ్ లుగా విజ‌యం సాధించారు. టీడీపీకి 14 పంచాయ‌తీలు ద‌క్క‌గా… సోదిలో లేని కాంగ్రెస్ పార్టీకి ఓ పంచాయ‌తీ ద‌క్కింది.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం నాలుగు మండ‌లాలుండ‌గా… కుప్పం మండ‌లంలో మొత్తం 26 పంచాయ‌తీలుండ‌గా… వాటిలో 21 పంచాయ‌తీల‌ను వైసీపీ గెలుచుకోగా… 5 గ్రామ‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. రామ‌కుప్పం మండ‌లంలో 22 పంచాయతీలుండ‌గా… వైసీపీ 19 చోట్ల గెలుపొంద‌గా, టీడీపీ 3 చోట్ల విజ‌యం సాధించింది. గుడుప‌ల్లె మండ‌లంలో మొత్తం 18 పంచాయ‌తీలు ఉండ‌గా… వైసీపీ 13 చోట్ల‌, టీడీపీ 4 చోట్ల‌, కాంగ్రెస్ పార్టీ ఒక పంచాయ‌తీలో విజ‌యం సాధించాయి. ఇక శాంతిపురం మండ‌లంలో మొత్తం 23 పంచాయ‌తీలు ఉండ‌గా… వైసీపీ 20 గ్రామాల్లో గెల‌వ‌గా… టీడీపీ 3 పంచాయ‌తీల‌కే ప‌రిమిత‌మైంది.

చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దీనిపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. ఏక‌గ్రీవాల కోసం చేసిన య‌త్నాలు ఫ‌లించ‌క‌పోగా… ప్లాన్ బీని అమ‌లులోకి తీసుకొచ్చిన పెద్దిరెడ్డి… ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగానే పెద్ద ఎత్తున ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ చేయించార‌ట‌. అంతేకాకుండా ఓట‌ర్ల‌లో మారుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన పెద్దిరెడ్డి… స‌రిగ్గా పోలింగ్ కు ముందు రోజు రాత్రి మరోమారు డ‌బ్బు పంపిణీకి తెర తీసిన‌ట్లుగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చిన అభ్య‌ర్థుల‌కు అండ‌గా నిల‌వాల్సిన టీడీపీ నేత‌లు కీల‌క స‌మ‌యంలో ప‌త్తా లేకుండా పోవ‌డం కూడా టీడీపీ ఘోర ప‌రాభ‌వానికి కార‌ణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మెజారిటీ పంచాయతీల‌ను గెలుచుకుని వైసీపీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.