పాదయాత్ర వల్ల ఉపయోగం ఉంటుందా ?

విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు వైసీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలవ్వబోతోంది. ఈనెల 20వ తేదీన వైజాగ్ లోని జీవీఎంసి గాంధీ విగ్రహం దగ్గర మొదలయ్యే పాదయాత్ర స్టీలు ప్లాంట్ దగ్గర ముగుస్తుంది. 25 కిలోమీటర్ల పాదయాత్రలో వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డే స్వయంగా నడుస్తారట. 25 కిలోమీటర్ల పాదయాత్రకు తానే నాయకత్వం వహిస్తానని విజయసాయి చెప్పారు. విజయసాయి పాదయాత్రంటే ఇతర నేతలు కూడా పాల్గొంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే ఈ పాదయాత్ర వల్ల ఏమిటి ఉపయోగం అన్నదే పెద్ద సందేహం. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నరేంద్రమోడి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సమీక్షించే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. గడచిన మూడున్నర మాసాలుగా వ్యవసాయ చట్టాల రద్దుకోసం రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఈ ఉద్యమాన్ని మోడి ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. వేలాదిమంది రైతులు చేస్తున్న ఉద్యమాన్నే మోడి పట్టించుకోలేదు.

పైగా ఉద్యమసమయంలో సుమారు 60 మంది రైతులు మరణించినా లెక్క చేయలేదు. రైతులు చేస్తున్న ఉద్యమంతో పోల్చుకుంటే ఉక్కుపరిశ్రమ కోసం జరుగుతున్న ఆందోళన చాలా తక్కువనే చెప్పాలి. రైతుఉద్యమంలో పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ రాష్ట్రాల్లోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అలాంటి ఉద్యమాన్నే పట్టించుకోని మోడి ఇక విశాఖలో జరుగుతున్న ఆందోళనను పట్టించుకుంటారా ?

ఉక్కు పరిరక్షణ ఆందోళనల్లో రాజకీయపార్టీల మధ్య ఉన్న అనైక్యత అందరికీ తెలిసిందే. ఏ విషయంలోను అధికార వైసీపీ-ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి పడదు. ఇలాంటి పరిస్దితుల్లో విజయసాయి పాదయాత్ర పేరుతో పెద్ద ప్రహసనాన్నే మొదలు పెట్టబోతున్నారు. ఈ పాదయాత్ర వల్ల కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి ఉండదని అందరికీ తెలిసిందే. మరి కేంద్రంపై ఒత్తిడి తేలేనపుడు పాదయాత్ర చేసి ఉపయోగం ఏమిటి ? ఏమిటంటే ఉక్కు కోసం తాము కూడా ఆందోళన చేశామని చెప్పుకోవటానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు.