విశాఖ ఉక్కు.. సాయిరెడ్డికి స‌వాలే.. రీజ‌నేంటంటే!

విశాఖ ఉక్కును పోస్కో సంస్థ‌కు విక్ర‌యించేందుకు జ‌రు గుతున్న ప‌రిణామాల వెనుక విజ‌య‌సాయిరెడ్డి కూడా ఉన్నారంటూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పెద్ద ఎత్తు న ‌ప్ర‌చారం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. ఇటీవల ఆయ‌న విశాఖ ఉక్కు కార్మికుల‌ను ప‌రామ‌ర్శించేందుకు అక్క‌డికి వెళ్లారు.

దీంతో అక్క‌డి కార్మికులు.. పార్టీల‌కు అతీతంగానే ఆయ‌న కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. నిజానికి విజ‌య‌సాయికి ఇది ఊహించ‌ని ప‌రిణామం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఎవ‌రి నుంచి కూడా ఇలాంటి ప‌రిణామం ఎదురు కాలేదు. దీంతో స్పందించిన ఆయ‌న ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామ‌న్ ద‌గ్గ‌ర‌ కు ప‌రిశ్ర‌మ కార్మికుల బృందాన్ని కూడా తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

అయినా వారు వెన‌క్కి త‌గ్గ‌కుండా.. ప్ర‌ధాని మోడీతోనే త‌మ‌కు భేటీ ఏర్పాటు చేయించాల‌ని.. అక్క‌డే విష‌యం తేల్చుకుంటామ‌ని చెప్పారు. దీంతో స‌రేన‌న్నారు. అయితే.. ఇది అంత తేలిక కాదు.. ఇటీవ‌ల కాలంలో విజ‌య‌సాయికి ప్ర‌ధాని అప్పాయింట్మెంట్ ఇవ్వ‌డం లేదు. ఆ మాట‌కొస్తే.. బీజేపీ కీల‌క నేత‌లు ఎవ‌రూ కూడా సాయిరెడ్డితో మాట్లాడ‌డం లేదు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ చైర్మ‌న్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌పై విజ‌య‌సాయిరెడ్డి నోరు పారేసుకున్నారు. దీనిపై బీజేపీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. ఈ క్ర‌మంలో సాయిరెడ్డికి ప్ర‌ధాని నుంచి అప్పాయింట్‌మెంట్ ఆశించ‌డం అంటే.. అది అంత తేలిక విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. ఈ రోజో రేపో.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ రానుంది. ఈ క్ర‌మంలో విశాఖ పీఠంపై వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన సాయిరెడ్డి.. ఇప్పుడు విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీని గట్టెక్కించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడా వ‌చ్చి నా.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో విశాఖ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకోవ‌డం సాధ్య‌మేనా? అనేది కీల‌క ప్ర‌శ్న‌.పైగా మారిన రాజ‌కీయ ప‌రిణామాలు.. టీడీపీ నాయ‌కుల జోరు.. ప‌ల్లా శ్రీనివాస‌రావు.. ఆమ‌ర‌ణ దీక్ష‌.. వంటివి రాజకీయంగా విశాఖ‌ను కుదిపేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి సాయిరెడ్డి ఈ యుద్ధంలో ఏమేర‌కు నెగ్గుతారో చూడాలి.