అన్నీ చెబుతా.. బీ రెడీ.. విజయసాయికి ఆర్కే సూటి వార్నింగ్

రాజకీయాలు మారిపోయాయి. గతంలో మాదిరి ఆచితూచి మాట్లాడటం లేదు. ఇవాల్టికి ప్రయోజనం జరిగితే చాలు. రేపటి సంగతి రేపు చూసుకుందామన్న తొందర.. అంతకు మించి.. తెంపరిమాటలే ఆయుధాలుగా మార్చుకొని.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో.. అలాంటి వారికి విపరీతమైన క్రేజ్ రావటమే కాదు.. వారిని వీరగా అభిమానిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో.. తాము ఏం మాట్లాడుతున్నామన్న విషయాన్ని కనీసం పట్టించుకోకుండా.. ఇష్టారాజ్యంగా మాట్లాడేయటం ఎక్కువ అవుతోంది. అయితే.. ఇలాంటివన్నీ ఈ డిజిటల్ యుగంలో అప్పటికి ఓకే అయినా.. తర్వాతి కాలంలో నీడలా వెంటాడటమే కాదు.. వేధిస్తాయన్న విషయాల్ని మర్చిపోతున్నారు.

ఇదంతా ఎందుకంటే.. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటల్ని.. ఒకటికొకటిగా పేరుస్తూ.. వివరంగా చెప్పటమే కాదు.. లాజిక్ గా తప్పులు ఎత్తి చూపిస్తే.. ఊపిరి ఆడనట్లుగా ఉక్కిరిబిక్కిరి ఖాయం. అలా పదునైన వాదనతో ఊపిరి ఆడనట్లుగా చేయటం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు అలవాటు. తన అక్షరాల్ని ఆయుధాలుగా మారుస్తూ రాసే ఆయన.. ఎవరి మీదనైనా విమర్శ బాణాన్ని ఎక్కు పెడితే.. లక్ష్యాన్ని ఛేదించేలా దూసుకెళ్లే ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది.

రెండు వారాల క్రితం ఆయన రెండు రాష్ట్రాల్లోని వారంతా ఉలిక్కిపడేలా.. రాజకీయ వర్గాలు షాక్ తినేలా ఒక అంశాన్ని ప్రస్తావించారు. రాజన్న కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నారు. అదెలా సాధ్యమని లాజిక్కులు తీసినోళ్లు చాలామందే ఉన్నారు. ఈ కథనాన్ని తిట్టినోళ్లు తిట్టిన తిట్టు తిట్టకుండా నాన్ స్టాప్ గా తిట్టిపోశారు. అయినా ఎలాంటి స్పందన లేనట్లుగా.. తాను చెప్పాల్సింది చెప్పేసి ఊరుకున్నట్లు ఉండిపోయారు.

కట్ చేస్తే.. రెండు వారాలు తిరిగేసరికి.. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టటం ఖాయమని తేలటమే కాదు.. ఆర్కే చెప్పింది అక్షరసత్యమని తేలిపోయింది. దీంతో.. ఆయన ఇంకేం చెబుతారన్న ఆసక్తి అందరిలోనూ ఎక్కువైంది. ఇలాంటివేళ.. తాజాగా తన కాలమ్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేనా.. సూటి వార్నింగ్ ఇచ్చేశారు. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చెబితే.. ఆసక్తికరంగా ఉండటమే కాదు.. విజయసాయి చేసిన తప్పుల్నిఆయన ఎంత జాగ్రత్తగా చెప్పారో ఇట్టే అర్థమైపోతుంది. మరిక ఆలస్యం ఎందుకు? ఏం చెప్పారో చూస్తే..

‘‘పరిటాల రవీంద్రను ఎందుకు హత్య చేశారని విలేకరులు ప్రశ్నించినప్పుడు సూరి బావ (మద్దెలచెర్వు సూరి) కళ్లలో ఆనందం చూడటానికి అని మొద్దు శీను అన్న మాటలు అప్పుడు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికైౖ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు హద్దు మీరి మాట్లాడుతున్నారు. జగన్‌ దగ్గర తన ప్రాభవం తగ్గకుండా ఉండడం కోసం విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో మీడియాపైన కూడా నోరు పారేసుకుంటున్నారు. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారని రెండు వారాల క్రితం నేను చెప్పినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. పార్టీ పెడితే గిడితే ఆంధ్రప్రదేశ్‌లో పెడతారు గానీ, తెలంగాణలో ఎందుకు పెడతారని లాజిక్కులు తీసే ప్రయత్నం చేశారు’’

‘‘జగన్‌కు, షర్మిలకు మధ్య విభేదాలు వచ్చాయని చెప్పడాన్ని ఇష్టపడని ఒక ప్రబుద్ధుడైతే ‘రాధాకృష్ణకు ఆయన కొడుకుతో పడటం లేదు. కొడుకు ఆంధ్రాలో పేపర్‌ పెట్టి రాధాకృష్ణను ముప్పుతిప్పలు పెట్టబోతున్నారు’ అని అజ్ఞానం, అసహనం ప్రదర్శించారు. వార్తను వార్తగా చూసే రోజులు పోయాయి కనుక ఎవరి ఇష్టం వారిదే. ఈ నెల 9న లోటస్‌పాండ్‌ వద్ద ఉన్న తన నివాసానికి చేరుకున్న షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ప్రయత్నిస్తానని ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రకటించారు. ఈ వార్తకు మీడియా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు కూడా షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు తెలియలేదట’’

‘‘షర్మిల రాజకీయ నిర్ణయం గురించి విలేకరులు ప్రశ్నించగా, ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ రాత్రి పూట కలలు కంటారు, ఆ కలలే పొద్దున ‘ఆంధ్రజ్యోతి’లో వార్తగా వస్తాయి అని వెటకారం ఆడారు. మేడం షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు తనకే తెలియదని, అలాంటప్పుడు రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వాదించారు కూడా! విజయసాయిరెడ్డికి తెలియకపోవడానికి నేను బాధ్యుణ్ని కాను కదా! విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే నేను కలగంటే కనిఉండవచ్చు. కానీ, ఆ కల వాస్తవమైంది కదా! విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా నాకు కొన్ని కలలు వచ్చాయి. అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది’’

‘‘ఇప్పుడు జగన్‌, షర్మిల మధ్య ముదిరిన విభేదాలతో పాటు తాడేపల్లి అంతఃపురం రహస్యాలను బయటపెడుతున్నందున విజయసాయిరెడ్డి ఇంకెంతగా నాపై రెచ్చిపోతారో వేచిచూడాలి. రెండు వారాల క్రితం నేను చెప్పిన మాటలను చాలామంది విశ్వసించలేదంటే అర్థం ఉంది. ఏమి జరుగుతున్నదో కళ్లెదుటే కనిపిస్తున్నా బుకాయించాలనుకోవడం తెంపరితనమే అవుతుంది. చెప్పింది రాసుకోవడమే జర్నలిజమని విజయసాయిరెడ్డి, ప్రభృతులు భావిస్తుండవచ్చు గానీ నేను నిన్నటి తరానికి చెందిన జర్నలిస్టును కూడా! సుబ్బారాయుడు, జి.కృష్ణ వంటి ఉద్ధండుల వద్ద జర్నలిజంలోని మెళకువలను నేర్చుకున్నాను’’

‘‘కంటికి కనిపించనివీ, చెవులకు వినపడనివీ ఎన్నో జరుగుతుంటాయి. వాటిని తెలుసుకొని ప్రజలకు తెలియజేయడం జర్నలిస్టుల బాధ్యత. ఒక మీడియా సంస్థ అధిపతిగా కూడా ఉన్న నేను రాసే కాలమ్‌లో అవాస్తవాలు, అభూతకల్పనలు రాస్తే, ‘ఆంధ్రజ్యోతి’, ఏబీఎన్‌ విశ్వసనీయత దెబ్బతినదా? జగన్‌కు, షర్మిలకు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? అని నన్ను ప్రశ్నిస్తే లాభం లేదు. సోదరుడితో విభేదించడానికి కారణం ఏమిటో షర్మిల తన బంధువులు, కుటుంబ శ్రేయోభిలాషులకు పూసగుచ్చినట్టు వివరించారు గనుక విజయసాయిరెడ్డి వంటి వారికి ఇప్పటికైనా స్పష్టత వస్తుందని ఆశిద్దాం’’