జగన్ నాయకత్వానికి పరీక్ష ఇపుడే మొదలైందా ?

మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ మెజారిటి సాధించిన జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు బాహుబలి రేంజిలో ప్రొజెక్టు చేస్తున్నారు. ఇందులో కాస్త నిజముంది మరికాస్త అతిశయోక్తి ఉంది. సరే పార్టీ వాళ్ళిష్టం కాబట్టి ఏమి చేసినా చెల్లుబాటైపోతోంది. మరి పార్టీ నేతలు చెబుతున్నట్లు నిజంగానే జగన్ కి బాహుబలి స్ధాయి ఉందా ? అంటే ఇపుడు జగన్ నాయకత్వానికి మొదలైన అసలైన పరీక్షలో పాస్ అయితేనే తెలుస్తుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్తరాంధ్ర జానల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులతో పాటు దానిపై ఆధారపడున్న జనాలందరిలోను కేంద్రమంటే మంట మొదలైంది. ఉద్యోగులు, కార్మికులు, కార్మికసంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఏమి చేస్తాయన్నది వేరేసంగతి. అధికారపార్టీగా వైసీపీ ఏమి చేస్తుంది అన్నదే ఇఫుడు అత్యంత కీలకం.

కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా పెద్దగా ఉపయోగం ఉండదు. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోడి తీసుకున్న ఈ నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు బహిరంగంగా వ్యతిరేకించేంత సీన్ లేదని అందరికీ తెలిసిందే. చంద్రబాబు వ్యతిరేకించనపుడు టీడీపీ ఎంపిలు కూడా ఏమీ చేయలేరు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి టీడీపీకి ఇఫ్పటికిప్పుడు వచ్చే నష్టమూ లేదు. కానీ వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపైనే ఉంది. జగన్ తీసుకునే లైన్ పైనే వైసీపీ ఎంపిలు నడుచుకుంటారు.

మరిపుడు జగన్ ఏమి చేయబోతున్నారు ? అన్నదే ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో తీర్మానం చేయటం, ప్రైవేటుపరం చేయద్దని మోడికి విజ్ఞప్తి చేయటంతో పని జరగదని అందరికీ తెలిసిందే. ఈ సమస్యను అధిగమించాలంటే కేంద్రాన్ని ఒప్పించి ప్రైవేటుపరం కాకుండా ఆపాలి. ఆపని జగన్ చేయలేరనే అనుకుందాం. మరపుడు ఏమి చేయాలి ? ఏమిచేయాలంటే కేంద్రంతో మాట్లాడి, కేంద్రం వాటాను రాష్ట్రప్రభుత్వం తిరిగి ఇచ్చేయాలి. కేంద్రం వాటాను తిరిగిచ్చేసిన తర్వాత మొత్తం స్టీల్స్ ను రాష్ట్రప్రభుత్వం తీసేసుకోవాలి.

పరిపాలనా రాజధానిగా వైజాగ్ కు వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్న జగన్ కు ఇపుడిది ఎంతో అవసరం. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోలేనపుడు వైజాగ్ కు రాజధానిని తరలించటం జగన్ నాయకత్వానికి మైనస్ అనే చెప్పాలి. అలాకాకుండా వైజాగ్ స్టీల్స్ ను గనుక కాపాడుకోగలిగితే ఉత్తరాంధ్రలో జగన్ కు తిరుగనేదే ఉండదు. ఒకవైపు స్టీల్స్ ను కాపాడారన్న క్రెడిట్ మరోవైపు రాజధానిని ఏర్పాటు చేశారన్న కీర్తి కారణంగా జగన్ ఇమేజి బాహుబలి అంతగా పెరుగుతుందేమో చూడాలి.