ఢిల్లీలో భారీ పేలుడు.. ఉగ్ర మూక‌ల ప‌నేనా?!

ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇటీవ‌ల గ‌ణతంత్ర వేడుక‌లు(బీటింగ్ రిట్రీట్‌) నిర్వ‌హించిన రాజ్‌ప‌థ్‌కు 1.4 కిలో మీట‌ర్ల దూరంలో ఈ పేలుడు సంభ‌వించ‌డం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. పైగా ఇజ్రాయెల్ రాయ‌బార కార్యాలయంవ‌ద్ద ఈ పేలుడు సంభ‌వించింది. ఓ పూల కుండీలో ఏర్పాటు చేసిన ఐఈడీ పేలుడు సంభ‌వించ‌డంతో భారీ శ‌బ్దాలు వ‌చ్చాయి. దీంతో ఢిల్లీ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఈ పేలుడు ధాటికి కార్లు తీవ్రంగా ధ్వంస‌మ‌య్యాయి. సాయంత్రం 5గంట‌ల 5 నిముషాల స‌మ‌యంలో సంభ‌వించిన ఈ పేలుడు స్థానికంగానే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది.

పేలుడు ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే అధికారులు రంగంలోకి దిగిపోయారు. బాంబు నిర్వీర్య దళంతోపాటు.. ఎన్ ఎస్ జీ క‌మెండోలు, పోలీసులు భారీ ఎత్తున ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే.. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని గుర్తించారు. అయితే.. స‌మీపంలో ఉన్న కార్ల అద్దాలు ధ్వంసం కావ‌డం, కొన్ని కార్ల‌కు టైర్లు పేలిపోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ పేలుడు ఘ‌ట‌న‌తో ఢిల్లీలోని అన్ని రాయ‌బార కార్యాల‌యాల్లోనూ హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఇజ్రాయెల్ కార్యాల‌యం వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రాయ‌బార కార్యాల‌యానికి దారితీసే అన్ని ర‌హ‌దారుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మూసివేశాయి.

ఇక‌, పేలుడు వెనుక ఉగ్ర‌మూక‌ల హ‌స్త‌మేదైనా ఉందా? అనే కోణంలో ద‌ర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఘ‌ట‌నా ప్రాంతాన్ని స్పెష‌ల్ టీం పోలీసులు త‌మ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇక‌, గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ముందుగానే దేశ నిఘా విభాగం అలెర్ట‌యింది. దేశంలో ఎక్క‌డైనా ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. అయితే.. అప్ప‌ట్లో ఏమీ జ‌ర‌గ‌లేదు. కానీ, అనూహ్యంగా ఇజ్రాయెల్ దౌత్య కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగిన ఈ పేలుడు సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రి దీని వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యంపై అధికారులు అప్పుడే ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.