మ‌ద‌న ప‌ల్లె జంట హ‌త్యల కేసు నేర్పుతున్న లెస్స‌నేంటి?

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన జంట హ‌త్య కేసు.. ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యంగానే ఉంది. ఎవ‌రూ న‌మ్మ‌లేని విధంగా జ‌రిగిన ఈ ఉదంతంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ న‌డిచింది. ప్ర‌ముఖ జాతీయ చానెళ్ల‌లోనూ దీనిపై చ‌ర్చ జ‌ర‌గ‌డం విశేషం. ఉన్న‌త‌స్థాయి విద్యావంతుల కుటుంబంలో వెలుగు చూసిన ఈ విషాదం వెనుక అస‌లు ఏం జ‌రిగింది? ఎవ‌రి ప్రోద్బ‌లైమైనా ఉందా? లేక‌.. మూఢ భ‌క్తి.. మితిమీరిన విశ్వాసమే ఉన్నాయా? అనే కోణంలో ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. అయితే.. ఈ ఘ‌ట‌న వెలుగు చూసిన విధానం ఏంటి? అస‌లు ఏం జ‌రిగింది? అనేది ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

సీన్‌-1: ఉన్నత విద్యావంతులైన వల్లేరు పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులకు భ‌గ‌వంతునిపై భ‌క్తి ఎక్కువ‌. ఈ క్ర‌మంలోనే వారి ఇద్ద‌రు కుమార్తెలు అలేఖ్య(27), సాయిదివ్య(23)లు కూడా భ‌క్తి మార్గంలో న‌డిచారు. అయితే.. ఇది అతి విశ్వాసం దిశ‌గా అడుగులు వేసింది. క‌రోనా స‌మ‌యంలో అంద‌రూ ఇళ్ల‌లోనే ఉండిపోయి.. మ‌రింత‌గా ఈ భ‌క్తిలో కూరుకుపోయారు. ఇదిలావుంటే, గ‌త ‌వారం అనూహ్యంగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. శివుడు త‌మతో మాట్లాడాడ‌ని.. తామే శివ‌స్వ‌రూపుల‌మ‌ని న‌మ్మిన త‌ల్లి ప‌ద్మ‌జ‌, తండ్రి పురుషోత్త‌మ నాయుడు.. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో అంద‌రూ దిగంబ‌రులై పూజ‌లు చేశారు. పున‌ర్జ‌మ‌పై అతి విశ్వాసంతో త‌మ కూతుళ్ల‌ను చంపేసి తిరిగి ప్రాణం పోస్తామ‌ని వారు భావించారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు కుమార్తెల‌ను డంబెల్‌తో మోది హ‌త్య చేశారు. అనంతరం.. ఆ తల్లిదండ్రులు కూడా హ‌త్య చేసుకోవాల‌ని భావించారు. అయితే..అరుపులు, కేక‌లు.. వినిపించ‌డంతో పొరుగు వారు పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేశారు. దీంతో ఈ ఘ‌ట‌న అక్క‌డితో ఆగిపోయింది.

సీన్‌-2: ఈ హ‌త్య‌ల కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృస్టించింది. పోలీసులు ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎక్క‌డా ఇత‌ర విష‌యాల జోక్యం లేద‌ని తేల్చేశారు. అంతేకాదు.. కేవ‌లం మూఢ భ‌క్తి.. ఎవ‌రికీ అంద‌ని ఓ భావ‌న త‌ల్లిదండ్రుల్లో క‌నిపించింద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఐ యామ్‌ నాట్‌ థీఫ్‌. ఐ యామ్‌ లార్డ్డ్‌ శివ. మరి నన్నెందుకు స్టేషన్‌కు రమ్మంటున్నారు అని త‌ల్లి ప‌ద్మ‌జ ప్ర‌శ్నించ‌డంతో పోలీసులే అవాక్క‌య్యారు. స్టేషన్‌లోనూ అరుపులు, కేకలు పెట్టారు. నేనే శివున్ని అంటూ పదేపదే వ్యాఖ్యలు చేస్తూ, దైవచింతన ప్రవచనాలను ఆంగ్లంలో వినిపించ‌డంతో పోలీసులు సైతం అవాక్క‌య్యారు. అరెస్టు అనంతరం జైలుకు త‌ర‌లించారు.

సీన్‌-3: మదనపల్లి సబ్‌‌జైల్లో రెండు రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు. అయితే, పద్మజ అర్ధరాత్రి లేచి కేకలు పెట్టడంతో జైల్లో ఉన్న‌వారు.. సిబ్బంది కూడా హడలెత్తిపోయారు. దీంతో మానసిక వైద్యురాలు రాధికను పిలిపించి పరీక్షలు చేయించారు. పద్మజ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో పద్మజ, పురుషోత్తంలను తిరుపతి తరలించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో సీసీటీవీ ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలించిన పోలీసులు.. మూడో వ్య‌క్తి పాత్ర ఉంద‌ని గుర్తించారు. ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు వెతుకులాట ప్రారంభించారు.

సీన్‌-4: ఈ మొత్తం ఎపిసోడ్‌ను ప‌రిశీలిస్తే.. భ‌క్తి అవ‌స‌ర‌మే. కానీ, అది మూఢ భ‌క్తిగా దారితీయ‌డే ప్ర‌మాద‌క‌రంగా మారింది. దేశంలో కొన్నాళ్ల కింద‌ట ఢిల్లీలోనూ ఇలాంటి మూడ విశ్వాసంతో ఓ జైన కుటుంబం ఉసురు తీసుకుంది. మ‌ళ్లీ పుడ‌తారంటూ.. ఆత్మ‌లు పైపుల ద్వారా ఇంట్లోకి వ‌చ్చి.. తిరిగి చ‌నిపోయిన వారి దేహాల్లోకి ప్ర‌వేశిస్తాయ‌ని న‌మ్మి.. ఇంట్లోనే పైపులు ఏర్పాటు చేసుకుని.. మూకుమ్మ‌డిగా 11 మందితో కూడిన కుటుంబం హ‌త్య చేసుకుంది. ఆ త‌ర్వాత‌.. ఇప్పుడు మ‌ద‌న‌ప‌ల్లె ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ తాజా ఘ‌ట‌న‌లో మ‌రో కోణంకూడా వినిపిస్తోంది. అతిగా చ‌ద‌వ‌డం(ప‌ద్మ‌జ మేథ‌మెటిక్స్ గోల్డ్ మెడ‌లిస్ట్‌, కుమార్తెలు , భ‌ర్త కూడా ఉన్న‌త విద్యావంతులు) కూడా ఇలాంటి ఎక్స్ ట్రీం ప‌రిస్థితుల‌కు దారితీసి ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ఘ‌ట‌న‌.. సంచ‌ల‌నంగా మార‌డం విశేషం.