ఎర్ర కోట వివాదం సిద్దూ పనేనా ?

ఎర్రకోటపై రైతులు ఎగరేసిన జెండా వివాదాం చిలికి చిలికి గాలవాన లాగ తయారవుతోంది. నిజానికి ఎర్రకోటపై జాతీయ జెండా తప్ప మరో జెండా ఎగరేసేందుకు లేదు. అలాంటిది రైతుసంఘాల ఉద్యమం, ఢిల్లీ వీధుల్లో జరిగిన అల్లర్ల నేపధ్యంలో కొందరు రైతులు ఎర్రకోటపైకి ఎగబాకి సిఖ్ఖుల జెండాను ఎగరేయటం సంచలనంగా మారింది. ఢిల్లీ అల్లర్లకు పోలీసులు, విద్రోహ శక్తులే కారణమని రైతుసంఘాలు, కాదు రైతుసంఘాల కారణమని పోలీసులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

సరే వీళ్ళ ఆరోపణలు ఎలాగున్నా ఎర్రకోటపై జెండా ఎగరేయటాన్ని మాత్రం రైతులు సమర్ధించుకోలేకపోతున్నారు. అయితే అమాయకులైన కొందరు రైతులను రెచ్చగొట్టి దీప్ సింగ్ సిద్దూ అనే వ్యక్తి ఎర్రకోటపైన జెండా ఎగరేసేట్లు చేశాడని ఇపుడు రైతుసంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీప్ సింగ్ సిద్దూ అనే వ్యక్తి ఎవరయ్యా అంటే టీవీ, సినీనటుడు. అలాగే పంజాబులో సింగర్ కూడానట. ఈయనకు బీజేపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడితో సిద్దూ సన్నిహితంగా దిగిన ఫోటోలను ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. దాంతో ఆ ఫొటోలను రైతుసంఘాలు సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఇఫుడా ఫొటోలు వైరల్ అయిపోయాయి. అంతే కాకుండా దీప్ మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున గురుద్వారాలో ఎంపిగా పోటీ చేసిన సన్నీడయోల్ కు మద్దతుగా ప్రచారం చేసిన ఫొటోలు కూడా ఇపుడు వైరల్ గా మారాయి.

అమాయకులైన రైతులను బీజేపీనే ఉద్దేశ్యపూర్వకంగా సిద్దూ ద్వారా రెచ్చగొట్టి ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చే కుట్ర చేసినట్లు రైతుసంఘాల నేతలు మండిపోతున్నారు. ఇదే సిద్దూను రెండు నెలలుగా జరుగుతున్న ఉద్యమం దరిదాపులకు కూడా రానీయకుండా తాము తీసుకున్న చర్యలను నేతలు చెబుతున్నారు. రైతుల ఉద్యమంలోకి చొరబడాలని సిద్దూ ఎంత ప్రయత్నించినా తాము అడ్డుకున్నట్లు చెప్పారు. చివరకు కేంద్రమంత్రులతో జరిగిన చర్చల్లో కూడా పాల్గొనేందుకు సిద్దూ ప్రయత్నించాడని రైతుసంఘాల నేతలు చెబుతున్నారు. ఏదేమైనా, రెచ్చగొట్టింది ఎవరైనా చివరకు చెడ్డపేరు వచ్చింది మాత్రం రైతు ఉద్యమానికే అన్నది వాస్తవం.