అరగంట రివ్యూతోనే అర్థమైంది.. వార్నింగ్ ఇచ్చేసిన కేసీఆర్

రాష్ట్రం ఏదైనా కానీ.. ముఖ్యమంత్రికి.. సెక్రటేరియట్ కు మధ్యనుండే అనుబంధం అంతా ఇంతా కాదు. వారి పాలన మొత్తం సచివాలయంలోనే సాగుతుంది. అయితే.. ఇందుకు మినహాయింపుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా ఆరేళ్లు దాటిపోయి.. ఏడేళ్లలోకి అడుగు పెట్టబోతున్న వేళలో.. మొత్తంగా ఏడు సార్లు కూడా సచివాలయానికి వెళ్లని సీఎం ఎవరైనా ఉన్నారంటే.. అది కేసీఆరే అని చెప్పాల్సిన ఉంటుంది.

కారణం ఏమైనా.. కేసీఆర్ కు నచ్చలేదు.. సచివాలయానికి వెళ్లలేదన్నది నిజం. తాను అనుకున్నట్లే సచివాలయాన్ని కూల్చేసి.. కొత్తది కట్టే పనులను షురూ చేసిన ఆయనకు.. జనవరి 26న సెక్రటేరియట్ నిర్మాణాన్ని ఒకసారి చూడాలనిపించింది. అంతే.. ఆర్ అండ్ బి అధికారులకు సమాచారం ఇచ్చి టైం డిసైడ్ చేశారు. చెప్పినట్లే.. టైంకు సెక్రటేరియట్ కు వెళ్లిన ఆయన.. ప్లాన్ కాపీ పట్టుకొని.. ఎక్కడేం పనులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. నిర్మాణ ప్లాన్ లో ఎక్కడేం వస్తున్నాయో తెలుసుకున్నారు.

సాధారణంగా కేసీఆర్ రివ్యూ అంటే.. ఆరేడు గంటలకు తగ్గదు. కానీ.. సెక్రటేరియట్ నిర్మాణ విషయంలో మాత్రం అరంగటకే పరిమితం చేశారు. ఆ మాత్రం దానికే ఆయనకు విషయం అర్థం కావటం.. అధికారులకు.. నిర్మాణదారులకు వార్నింగ్ ఇచ్చేశారు కేసీఆర్. పనులు అనుకున్నంత వేగంగా సాగటం లేదని.. ఒక్కరోజు కూడా అదనంగా సమయం ఇచ్చే ప్రసక్తి లేదని.. తేడా వస్తే ఫైన్ కట్టాల్సి ఉంటుందని తేల్చేశారు. ప్రతిపాదనల్లో ఏమేం చెప్పారో.. నిర్మాణంలో ఏ ఒక్కటి మారకూడదన్న విషయాన్ని మరోసారి తేల్చేసిన ఆయన.. పనుల వేగానని పెంచాలన్న విషయాన్ని కచ్ఛితంగా చెప్పారు.

కేసీఆర్ రివ్యూ అంటే చాలు.. ఆయన ఎంత లోతుల్లోకి వెళతారో తెలిసిందే కదా. దానికి తగ్గట్లే తాజా ఉదంతంలోనూ అధికారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కేసీఆర్ ఉన్న అరగంట.. అధికారులకు వణుకు తెప్పించిందని చెబుతున్నారు. పునాదులు తీసే సమయంలో పెద్ద పెద్ద బండరాళ్లు రావటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని..పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు చెప్పిన సాకు.. సీఎం కేసీఆర్ కు అస్సలు నచ్చలేదు. ఏమైనా.. అరగంట రివ్యూకే విషయం అర్థం కావటం.. తీవ్రమైన వార్నింగ్ ఇవ్వటం జరిగిపోయాయి. ఇప్పుడు సాగుతున్న లెక్కలో చూస్తే.. రెండేళ్లకు సచివాలయం పూర్తి అయినా ఆశ్చర్యమేనని చెప్పక తప్పదు.