నిమ్మ‌గ‌డ్డ కొర‌డా.. అధికారుల ప‌రిస్థితి అల్ల‌క‌ల్లోలం!!

ఏది జ‌రుగుతుంద‌ని మాజీ ఐఏఎస్‌లు చెప్పారో.. ఏది జ‌రుగుతుంద‌ని ప్ర‌జాస్వామ్య వాదులు అనుకు న్నారో.. అదే జ‌రిగింది. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన సంస్థ‌గా ఉన్న రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను ధిక్క‌రించ‌వ‌ద్ద‌ని, ఇష్టం ఉన్నా.. క‌ష్ట‌మే అయినా.. ఒక్క‌సారి ఎన్నిక‌ల కోడ్ అంటూ వ‌చ్చేశాక‌.. క‌మిష‌న‌ర్ సుప్రీం అవుతార‌ని.. రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా.. ఎంత సీనియ‌ర్ల‌యినా.. క‌మిష‌న‌ర్ చెప్పిన‌ట్టు ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయాల్సిందేన‌ని అనేక మంది నెత్తీనోరూ మొత్తుకున్నారు. అయినా.. కొంద‌రు అధికారులు మాత్రం ఎన్నిక‌ల క‌మిష‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను లైట్ తీసుకున్నారు. మీరు చెప్పేదేంటి.. మేం వినేదేంటి? అనే రేంజ్‌లో వ్య‌వ‌హ‌రించారు.

ఈ క్ర‌మంలోనే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ షెడ్యూల్ విడులైన త‌ర్వాత‌.. దానికి త‌గిన ‌విధంగా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తోనూ స‌మావేశాలు నిర్వ‌హించి.. ఏర్పాట్లు చేయాల‌ని నిమ్మ‌గ‌డ్డ ఆదేశించినా.. కొత్త ఓట‌ర్ల‌తో కూడిన జాబితాలు ఇస‌ద్ధం చేయాల‌ని సూచించినా.. రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ కార్య‌ద‌ర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, ఆ శాఖ క‌మిష‌న‌ర్ గిరిజా శంక‌ర్‌లు ధిక్కారం ప్ర‌ద‌ర్శించారు. మేం కోర్టులో కేసులు వేశాం.. తేలిన త‌ర్వాతే.. చూద్దాం.. అని నేరుగా పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.. క‌నుక‌.. తాముఈ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌లేమ‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఫ‌లితంగా పాత ఎన్నిక‌ల జాబితాతోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో కొంద‌రు.. హైకోర్టులో త‌మ‌కు ఓటు హ‌క్కు క‌ల్పించాలంటూ.. పిటిష‌న్లు వేశారు. వీటిపై బుధ‌వారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వేగంగా స్పందించారు. తాను చెప్పిన ప‌నిని చేయ‌డంలో విఫ‌ల‌మైన అధికారులు ఇద్ద‌రిపైనా తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంక‌ర్‌లు ఇద్ద‌రూ విధులు నిర్వ‌హ‌ణ‌కు అన‌ర్హులుగా పేర్కొన్నారు. వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వీరి నిర్ల‌క్ష్యాన్ని, విధుల్లో చూపిన అల‌స‌త్వాన్ని వారి స‌ర్వీసు రికార్డుల్లోనూ న‌మోదు చేయాల‌ని నిమ్మ‌గ‌డ్డ‌ ఆదేశించారు. ఇది పెద్ద ఎదురు దెబ్బ‌గా భావిస్తున్నారు అధికారులు.

నిమ్మ‌గ‌డ్డ ఆదేశాల మేర‌కు.. స‌ర్వీసు రికార్డుల్లో ఆ ఇద్ద‌రు అధికారుల అల‌స‌త్వం న‌మోదైతే.. ప‌దోన్న‌తుల విష‌యంలోనూ, కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంలోనూ అన‌ర్హులు అవుతారు. ప్ర‌స్తుతం నిమ్మ‌గ‌డ్డ తీసుకున్న నిర్ణ‌యం.. అధికారులు, ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశమైంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఉన్న‌త‌స్థాయి అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు ఫ‌లితం అనుభ‌విస్తున్నార‌నే కామెంట్లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రంప‌ర‌లో నిమ్మ‌గ‌డ్డ మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటే.. మున్ముందు మ‌రింత మంది అధికారులు ఇబ్బందుల్లో చిక్కుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.