కేటీయార్ పట్టాభిషేకం ఖాయమేనా ?

కల్వకుంట్ల తారకరామారావుకు తొందరలో పట్టాభిషేకం ఖాయమేనా ? పార్టీ వర్గాలు, మీడియా సమాచారం ప్రకారమైతే ఖాయమనే అనిపిస్తోంది. తొందరలోనే ముఖ్యమంత్రిగా కేసీయార్ రాజీనామా చేయటం, కొడుకు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటం ఖాయమనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఫిబ్రవరి 18వ తేదీ కేటీయార్ పట్టాభిషేకానికి మంచి ముహూర్తంగా కేసీయార్ ఇప్పటికే డిసైడ్ చేశారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

నిజానికి కేసీయార్ స్ధానంలో కేటీయార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలోనే ఇటువంటి ప్రచారం జరిగింది. తర్వాత 2019లో కూడా మళ్ళీ ఇలాంటి ప్రచారమే ఊపందుకుంది. కేసీయార్ కు అనారోగ్యంగా ఉందని ఒకసారి, లేదు లేదు జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కారణంగా రాష్ట్రంలో పగ్గాలు కేటీయార్ కు అప్పగించబోతున్నారంటు మరోసారి ప్రచారం అందరికీ తెలిసిందే.

సరే తర్వాత కొంతకాలానికి ఆ ప్రచారం సద్దుమణిగిపోయింది. అయితే మళ్ళీ ఇపుడు తాజాగా అలాంటి ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం ఏమిటంటే సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేటీయార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే తప్పేమిటి అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. దాంతో సీఎంగా కేటీయార్ అనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతోంది. అసలు ఇప్పటికే కేటీయార్ అనధికారిక సీఎంగా చెలామణి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఎక్కువ భాగం కేటీయారే తీసుకుంటున్నారు.

టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో అయినా పార్టీ నేతల్లో అయినా కేటీయార్ ను వ్యతిరేకించే వాళ్ళే లేరు. కేటీయార్ సీఎం అవటంలో అవరోధాలు కూడా ఏమీలేవు. కాకపోతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న కేసీయార్ ఊపు ఇపుడు కనిపించటం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ తర్వాత కేసీయార్ ఊపంతా బాగా చప్పబడిపోయింది.

అంతకుముందు కేంద్రాన్ని ఎంతబడితే అంత మాట్లాడిన కేసీయార్ గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అప్పటి నుండి కేసీయార్ అసలు కేంద్రం గురించి మాట్లాడటమే లేదు. మరిటువంటి అనేక పరిణామాల నేపధ్యంలో కేటీయార్ కు పట్టాభిషేకం అనే ప్రచారంలో ఎంతవరకు నిజముందో చూడాల్సిందే.