షాకింగ్‌: భార‌త భూభాగంలో చైనా గ్రామం

చైనా దౌర్జ‌న్యాల‌కు, దురాక్ర‌మ‌ణ‌ల‌కు ఇది మ‌రో నిద‌ర్శ‌నం. స‌రిహ‌ద్దు వెంబ‌డి ఏదో ఒక నీతి మాలిన ప‌ని చేస్తూ భార‌త్‌ను నిరంత‌రం క‌వ్విస్తూ ఉండే డ్రాగన్ కంట్రీ.. మ‌రోసారి త‌న కుటిల బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంది. భార‌త భూభాగంలో ఆ దేశం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించి మ‌న దేశానికి స‌వాలు విసిరింది.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర భూభాగం త‌మ‌దే అని వాదించే చైనా.. తాజాగా అక్క‌డ‌ ఓ గ్రామాన్నే నిర్మించిన‌ట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్ల‌డైంది. ఆ గ్రామంలో 101 గృహాలు ఉన్నట్టు గుర్తించారు. సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల దూరం భార‌త భూభాగంలోకి చొర‌బ‌డి చైనా సైన్యం ఈ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు చెబుతున్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలోని త్సారి చు నదీ తీరం వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు.

ఈ ప్రాంతంపై భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్నాయి. గత ఏడాది నవంబరు 20న తీసిన‌ట్లుగా చెబుతున్న ఉప‌గ్ర‌హ చిత్రాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దేశ భద్ర‌త గురించి ఘ‌నంగా ప్ర‌క‌ట‌న‌లు చేసే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. చైనా సైన్యం వ‌చ్చి మ‌న భూభాగంలో ఒక గ్రామాన్నే నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ స‌హా ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

నరేంద్ర మోడీ ఓ బలహీన, అసమర్థ ప్రధాని అని.. చైనా మ‌న భూభాగంలో గ్రామం నిర్మించ‌డం చూస్తే షీ జిన్ పింగ్‌కు మోడీ స‌ర్కారు ప్రత్యేక ఆవాస్ యోజన క‌ల్పించిన‌ట్లు ఉంద‌ని ఒవైసీ ఎద్దేవా చేశారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై మోడీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.