తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక సామాన్య మహిళ మీద పోలీస్ యూనిఫామ్ లో వున్న వ్యక్తి భౌతికంగా దాడి చేయడమే కాకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళుతున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు, నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణాలో పోలీసులు అదుపు తప్పుతున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల మీద పోలీసుల దాష్టికం ఎక్కువై పోతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
తెలంగాణా రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున వున్న హాఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చెత్త ఎరుకునే ఒక మహిళపై హోం గార్డు ఆనంద్ దాడి చేశాడు. కర్రతో కొట్టడమే కాకుండా కింద పడిపోయిన ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. చుట్టుపక్కల వున్న స్థానికులు విడిపించే ప్రయత్నం చేసినప్పటికి వినిపించుకోలేదు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిముషాల్లోనే ఈ దృశ్యం వైరల్ అయ్యింది.
మొదట దాడికి పాల్పడింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే దాడి చేసిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాదని, డ్యూటీలో భాగంగా వచ్చిన తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన హోంగార్డని, అతడిని ఆనంద్ అని గుర్తించారు.
హోంగార్డు ఆనంద్ సదరు మహిళ మీద ఎందుకు దాడి చేశాడో ఎవరికీ అర్ధం కావట్లేదు. బాధిత మహిళ దూషించడం వల్లనే ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు హోంగార్డు అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. హోం గార్డు ఆనంద్ ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ స్నేహా మెహ్ర ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఆనంద్ మీద కేసు నమోదు చేశారు. డీజీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు ను సర్వీస్ నుంచి రిమూవ్ చేయడాన్ని నేటిజన్లు స్వాగతిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates