మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 67 ఎకరాల భూమి ఉన్న కేసీఆర్ కు 1000 ఎకరాలు ఎలా వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. దాంతోపాటు, కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు కొల్లగొట్టిందని రేవంత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దీటుగా స్పందించారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ ఆస్తులు తీసుకొని 1000 కోట్లు ఇస్తే చాలని, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని సవాల్ విసిరారు. అంతేకాదు, మిగతా 99 వేల కోట్లు రేవంత్ తీసుకొని సంక్షేమ పథకాలకు అమలు చేయాలని కేటీఆర్ సూచించారు. తులం బంగారంతో పాటు మిగతా పథకాలు ఆ డబ్బులతో అమలు చేయాలని, రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆ డబ్బు ఉపయోగించుకోవాలని కేటీఆర్ అన్నారు.
ఇక, కేసీఆర్ కు 1000 ఎకరాల భూమి ఉందని రేవంత్ ప్రచారం చేశారని, కానీ, అసెంబ్లీలో కేసీఆర్ కు 67 ఎకరాల భూమే ఉందని స్వయంగా రేవంత్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం విషయంలోనూ లక్ష కోట్లు అంటూ కేసీఆర్ పై దుష్ప్రచారం చేశారని, ప్రగతి భవన్ లో 150 బెడ్ రూమ్ లు అంటూ విష ప్రచారం చేశారని, ఈ లక్ష కోట్ల వ్యవహారం కూడా చిల్లర ప్రచారం అని కేటీఆర్ కొట్టిపారేశారు. ఎంత ప్రచారం చేసినా తట్టుకుంటామని అన్నారు. ఫార్ములా ఈ రేసు క్యాన్సిల్ చేసి తనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు.
తమిళనాడు సీఎం విజయ్ మోటార్ కార్ రేసులు వీక్షించేందుకు లండన్ వెళ్లారని, మోటార్ ఈ కార్ ల రంగంలో పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ, ఆ ప్రయత్నం తాను చేస్తే కేసులు పెట్టారని మండిపడ్డారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని అన్నారు. రేవంత్ కు బాకా ఊదే మీడియాలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు కొల్లగొట్టిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు రేవంత్ మానుకోవాలని హితవు పలికారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates