కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. 700 ఎకరాల ఫామ్ హౌస్‌లో 388 ఎకరాలు ప్రభుత్వ భూమే ఉందని.. దీనిని పేదలకు పంచుతానని గతంలో ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఎందుకు ఆ పని చేయలేదని నిలదీశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫామ్ హౌస్ భూములు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు, ప్రజలకు వివరించేందుకు విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ఈ విచారణ నెల రోజుల్లోనే ముగియనుందని కూడా చెప్పారు.

అదే సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్‌రావు, మాజీ నాయకురాలు, ప్రస్తుత టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత భూములు సహా ఇతర నాయకుల భూముల వివరాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 439 ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా గత ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు సహకరించిన అధికారులకు కూడా అత్యంత తక్కువ ధరకే భూములు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీరిలో ఐపీఎస్ అధికారి స్టీఫెన్‌సన్ కూడా ఉన్నట్టు తెలిపారు. రూ.50 కోట్ల విలువైన భూములను కేవలం కోటిన్నర రూపాయలకే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేశారని ఆరోపించారు.

కేసీఆర్‌ను కుక్కలు కూడా పట్టించుకోవు!

కేసీఆర్‌ను కుక్కలు కూడా పట్టించుకోవని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్‌పై బాంబు వేయిస్తానని ప్రచారం చేస్తున్నారని.. తనకు ఆ అవసరం లేదన్నారు. కేసీఆర్ రోడ్డున వెళ్తుంటే కుక్కలు కూడా ఆయనను పట్టించుకోవని వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేసీఆర్ హయాంలో లక్ష కోట్ల రూపాయల విలువైన కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దీనిని కూడా బయటపెడతామని చెప్పారు. ధరణి పోర్టల్ అక్రమాలను నిగ్గు తేలుస్తామని చెప్పారు. ఆయా వివరాలన్నీ బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీలో ఉండగానే వెల్లడిస్తానని సీఎం ప్రకటించారు. వారు సభకు వచ్చేలా స్పీకర్ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.

సీఎం చెప్పిన కేసీఆర్ కుటుంబానికి భూముల లెక్క ఇదీ..

సిద్ధిపేటలో కేసీఆర్‌కు: 67.5 ఎకరాలు

కేటీఆర్‌కు: 123 ఎకరాలు

హరీష్‌రావుకు: 30 ఎకరాలు

కవితకు: 37 ఎకరాలు

జోగినపల్లి సంతోష్‌రావుకు: 79 ఎకరాలు

కేసీఆర్ బంధువు నవీన్‌రావుకు: 52 ఎకరాలు

కొండల్‌రావుకు: 48 ఎకరాలు