మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వయ్యిందా ?

బోయినపల్లి కిడ్నాప్ గా సంచలనం సృష్టించిన ముగ్గురు సోదరుల కిడ్నాప్ ఘటనలో మాజీమంత్రి , టీడీపీ నేత భూమా అఖిలప్రియ అత్తగారి కుటుంబం మొత్తం ఇన్వాల్వయినట్లు పోలీసులు నిర్ధారించారు. ముగ్గురు సోదరుల కిడ్నాప్ కు ముందు భూమా అఖిలప్రియ, ఆమ భర్త భార్గవరామ్, మరిది చంద్రహాస్, అత్తగారు కిరణ్మయి, మామగారు మురళిని నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చటం సంచలనంగా మారింది.

ఓ కిడ్నాప్ ఘటనలో మొత్తం కుటుంబం కుటుంబమంతా నిందితులుగా మారటం బహుశా ఇఫ్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారేమో. కిడ్నాప్ కు ముందు అందులో పాల్గొన్న గ్యాంగుకు భార్గవరామ్ తల్లి, దండ్రులకున్న స్కూల్లోనే బస, వసతి ఏర్పాటు చేశారు. బస, వసతి ఏర్పాటు చేయటమే కాకుండా గ్యాంగులోని కొందరికి ఇన్ కమ్ ట్యాక్సు అధికారుల్లాగ నటించటానికి అవసరమైన ట్రైనింగ్ కూడా స్కూల్లోనే ఇచ్చినట్లు నిర్ధారణ చేసుకున్నారు.

సినిమా కంపెనీ నుండి పోలీసుల డ్రెస్ తెచ్చి మరీ ఐటి అధికారులకు సెక్యురిటి ట్రైనింగ్ కూడా ఇచ్చారట. అయితే ఇంత తెలుసుకున్న పోలీసులకు మాజీమంత్రి అత్త, మామలను పట్టుకోవాలన్న ఆలోచన మాత్రం ముందుగా రాలేదు. దాంతో తమకు దొరికిన కొద్ది రోజుల గ్యాపును చక్కగా ఉపయోగించుకున్నారు నిందితులు. అఖిల అత్త కిరణ్మయి, మామగారు మురళి తమ స్కూలికి తాళాలు వేసి పారిపోయారు.

అంటే ఇటు అత్త, మామలే కాదు భార్గవరామ్, చంద్రహోస్ నలుగురు పరారీలోనే ఉన్నారు. భార్గవరామ్ మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఎక్కడున్నారో మాత్రం పోలీసులకు ఆచూకీ దొరకలేదు. అలాగే అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి కూడా పోలీసులకు దిరక్కుండానే తప్పించుకుంటున్నాడు. కిడ్నాప్ కేసులో బావగారికి తోడుగా నిలబడి పర్యవేక్షించినందుకు బావమరిది మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవన్నీ పక్కనపెడితే అఖిల చెల్లెలు భూమా మౌనికారెడ్డి కూడా గడచిన నాలుగు రోజులుగా ఎక్కడా కనబడటం లేదట.