జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు. ఎవరి మానాన వారు మాటల తూటాలు పేల్చేస్తున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎమ్మల్యేలు, ఎంపీలు.. ఇతర నాయకులు కూడా.. సంయుక్తంగా ప్రజల మధ్యకు వెళ్లాలని పార్టీ నిర్దేశించింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. తాజాగా పార్టీ నాయకులతో మమేకమయ్యారు.
కోనసీమ జిల్లాలోని కీలకమైన అమలాపురం నియోజకవర్గం నేతలతో ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? నాయకులను ఎలా సమీకరించాలి?.. పనితీరు ఎలా ఉండాలి? కూటమిని ఎలా కలుపుకొని ముందుకు సాగాలి? అనే విషయాలను పక్కన పెట్టేసి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తన వ్యూహాన్ని వివరించే ప్రయత్నంచేశారు. అదేసమయంలో మళ్లీ `కాపు`ల ప్రాధాన్యం.. పవన్ ప్రాధాన్యం వంటి వాటిని వివరించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 50 నుంచి 60 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని.. ఆ మేరకు టికెట్లు తీసుకునేలా ఉన్నామని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. జనసేన బలాన్ని ఆ మేరకు పెంచుకునేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు, నాయకులు కూడా కలిసి పనిచేయాలన్నారు. అదే సమయంలో కాపుల ప్రాధాన్యాన్ని విస్మరించరాదని.. కాపులు బలంగా ఉన్న జిల్లాలపై జనసేన పట్టు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. మొత్తంగా.. అసలు విషయాన్ని వదిలేసి.. వచ్చే మూడేళ్లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడడం ఆసక్తిగా మారింది.
అసలు వ్యూహం ఏంటి?
జనసేన పార్టీ పరంగా అసలు వ్యూహం ఏంటి? అనేది.. ఇటీవలే పవన్ కల్యాణ్ వివరించారు. కూటమి పార్టీలు.. స్థానిక ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేస్తాయని.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది పార్టీ నిర్దేశిస్తుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అందరూ సమైక్యంగా ఉండడం.. గెలుపు మంత్రంతో ముందుకు సాగడం వంటి వాటిని నిర్దేశించుకోవాలని కూడా.. పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కానీ.. కొందరు నాయకులు ఇంకా అసలు విషయాన్ని ఒంటబట్టించుకున్నట్టుగా లేకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates