దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం లోని నాలుగు కిలో మీటర్ల పరిధిని పోలీసులు ప్రత్యేక జోన్గా ప్రకటించారు. అదేసమయంలో `యాక్ట్ 30` కింద ఆంక్షలు విధించారు. అంటే.. ఎలాంటి నిరసనలు, ఆందోళనలను చేపట్టడానికి వీల్లేదన్నమాట. ఇక, మొత్తంగా 500 సీసీ కెమెరాలు.. 15 వేల మంది పోలీసులు.. నగరాన్ని చుట్టుముట్టేయనున్నారు. వీరితో పాటు సరిహద్దు ప్రాంతాల్లో 2 వేల కంపెనీల పారామిలిటరీ దళాలను కూడా మోహించనున్నారు.
మొత్తంగా చూస్తే.. 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీ అష్టదిగ్బంధం కానుంది. మరి ఎందుకింత హడావుడి.. ఎందుకింత భద్రత..? అనేది సహజంగా వినిపించే ప్రశ్న. దీనికి కారణం.. బ్రిక్స్ సదస్సు!. ఈ నెల 12 నుంచి 13 వరకు అంటే రెండు రోజుల పాటు ఢిల్లీలోని సువిశాలమైన భారత మండపంలో ఈ సదస్సు జరగనుంది. దీనికి సుమారు 15 దేశాల నుంచి అగ్ర నేతలు, వారి ప్రతినిధులు హాజరు కానున్నారు. మరీ ముఖ్యంగా అత్యంత భద్రత నడుమ ఉండే బ్రిక్స్ దేశాల నేతలు కూడా పాల్గొంటారు.
ఏంటీ బ్రిక్స్?
బ్రిక్స్ అంటే.. బ్రెజిల్(B)-రష్యా(R)-ఇండియా(I)-చైనా(C)-దక్షిణాఫ్రియా(S).. ఆయా దేశాల ఇంగ్లీష్ పేర్ల తొలి అక్షరాలతో బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ఇవి ప్రధాన సభ్య దేశాలే అయినప్పటికీ.. వీటికి మద్దతు ఇచ్చే మరిన్ని దేశాలు కూడా.. ఈ సదస్సుకు హాజరు కానున్నాయి. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్ కు లభించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న సదస్సు 18వదికావడం గమనార్హం. గతంలో నాలుగు సార్లు ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహించింది.
ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?
వ్యూహాత్మక స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం మరియు సుస్థిరత అనే కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ టెక్నాలజీ, భద్రత, ఇంధనం, గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలపై చర్చిస్తారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తుండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రానున్నారు. ఈనేపథ్యంలోనే ఉగ్రవాద ముప్పు.. ఇతరత్రా ఆందోళనలు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీని పోలీసులు అష్టదిగ్భంధం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates