ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణా అధికార కాంగ్రెస్లో పరిస్థితి నూటెనిమిది డిగ్రీల సెల్సియస్ దాటింది. కొండా సురేఖ ఎపిసోడ్ బర్తరఫ్ తర్వాత కూడా వెబ్ సిరీస్ తరహాలో కథ కంటిన్యూ అవుతుంది. సిజన్ వన్ ముగిసి సీజన్ టూ లోకి వచ్చింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ లో కూడా వాతావరణం కాస్త అటూ ఇటూ తుఫాను ముందు ప్రశాంతతను తలపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉక్కపోతే కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు సూపర్ ఎల్ నినోతో పోటీ పడుతూ రాజకీయాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కాస్త ముందూ వెనకగా రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణాలో 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 2025 మే 13 న జరిగిన 16 వ శాసన సభ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రెండూ రాష్ట్రాల్లో అధికారంలో వున్న బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఘోరంగా ఓటమి పాలయ్యాయి.
ఈ రెండు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడే ఎన్నికలకు సిద్ధం అవుతుంది. గత వారం రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కెసిఆర్ పాచికలు వేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కెసిఆర్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది నుంచి బస్సు యాత్ర చేపట్టే ఆలోచనతో వున్నట్లు ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతిపక్ష వైసీపీ 2029 ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటుంది. ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ చివరికల్లా ఎన్నికలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత జగన్ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఏక గ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంచార్జిలకు అసెంబ్లీలో పోటీ చేయడానికి సీటు ఇచ్చేది లేదని ప్రకటించారు. పులివెందుల మున్సిపాలిటీని ఏకగ్రీవంగా కైవసం చేసుకొని సొంత నియోజకవర్గంలో జగన్ కు చెక్ పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈక్రమంలో స్థానిక ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయడానికి జగన్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికి ఒకే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. సమ్మతి, అసమ్మతి విషయంలో కావచ్చు, అలవాట్లు, పొరబాట్ల సంగతులు కావచ్చు మక్కికి మక్కి ఒకేలా వుంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జెండాలు, ఎజెండాలు వేరైనా నాయకులు మూస తరహానే కొనసాగుతున్నారని జనం చెప్పుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates