ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కట్టకట్టుకొని ఢిల్లో మకాం వేసి వున్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ తదుపరి పరిణామాలు అధికార పార్టీలో ముసలం పుట్టించడం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గ్రూపుల మధ్య గొడవలను కట్టడి చేయడానికి ఢిల్లీ పెద్దలు సంసిద్ధులు కావడంతో పంచాయితీ హస్తినకు చేరింది. మూడవ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ అండ్ కోకు పెద్దల నుంచి పిలుపు రాగా అంత వరకు ఆగలేమంటూ కాంగ్రెస్ నాయకులంతా ఒకరోజు ముందుగానే ఢిల్లీ చేరుకొన్నారు. ఎవరికి దారిలో వారు రాజకీయాలు మొదలుపెట్టారు. దాంతో ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కారులో జరిగిన పరిణామాలపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో బుధవారం సాయంత్రం వైఎస్సార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీఎం, మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజాజీ మార్గ్ లోని ఖర్గే ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కారులో కాన్స్టిట్యూషన్ క్లబ్ కు చేరుకున్నారు. అవార్డు ప్రధానోత్సం ముగిసిన తరువాత అదే కారులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ తో కలిసి మల్లికార్జున ఖర్గే తిరిగి ఇంటికి చేరుకున్నారు. సీఎం తో కలిసి కారులో వెళ్లిన ఖర్గే డిప్యూటీ సీఎం తో కలిసి ఇంటికి చేరుకోవడం మీడియా గమనించింది. కారులో వారి మధ్య ఏమి చర్చలు జరిగి ఉంటాయన్న దానిమీద మీడియా రకరకాలుగా ఊహాగానాలు చేస్తుంది.
ఢిల్లీలోనే వున్న మంత్రి కొండా సురేఖ అంతకుముందే మల్లికార్జున ఖర్గేతో కలిసి తన వాదన వినిపించారు. అయితే ఆమెతో ముక్తసరిగా మాట్లాడి పంపినట్లు ప్రచారం జరుగుతుంది. కొండా వాదన వినడానికి కూడా ఆయన ఆసక్తి చూపించలేదని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా మంగళవారం సాయంత్రానికే ఢిల్లీ చేరుకున్న సురేఖకు ఏఐసీసీ కార్యాలయంలో అవమానం జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. నాయకులెవరూ ఆమెకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వినిపిస్తుంది. దాంతో బుధవారం సాయంత్రమే సురేఖ ఢిల్లీ నుంచి తిరుగుముఖం పట్టారు.
ఈ మొత్తం పరిణామాలు కొండా సురేఖ మీద వేటు పడుతుందని సూచిస్తున్నాయని చెప్పొచ్చు.
విషయం స్పష్టంగా అర్ధమైంది కనుకనే మంత్రి కొండా సురేఖ అమీతుమీకి సిద్దపడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఆమె ఢిల్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడి మీద ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. నిన్నా మొన్నటి వరకు కూతురు సుస్మిత కామెంట్స్ తో తనకు సంబంధం లేదని ఖండిస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు కూతురి కామెంట్స్ ను సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు. పనిలోపనిగా బీసీ కార్డును ప్రయోగించడం, సీఎం సామాజిక వర్గాన్ని ఎత్తి చూపడం వంటి ధిక్కారం ప్రదర్శించి అధిష్టానానికి లైన్ క్లియర్ చేశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates