పాపం.. గీత మాత్రం ఏం చేస్తారు.. ప‌వ‌న్ ఇలా చేస్తార‌నుకోలేదా..!

పాపం గీత –  పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. రాజ‌కీయంగా ఆమె ఇక్క‌డ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.. ప‌రాజ‌యం పాల‌య్యారు. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో 70 వేల‌కు పైగా ఓట్ల తేడాతో గీత ఔట‌య్యారు. క‌ట్ చేస్తే.. రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత‌.. స‌హ‌జంగా ఏర్ప‌డే సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని అంచ‌నా వేసుకున్నారు. ఇది ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రైనా చేసే ప‌నే. కానీ, ఇక్క‌డే గీత‌కు ఛాన్స్ చిక్క‌డం లేద‌ట‌. ఈ మాట సొంత నేత‌లే చెబుతున్నారు.

ఎందుకు ?
పిఠాపురంపై ప‌వ‌న్ పూర్తి మ‌న‌సు పెట్టేయ‌డ‌మేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి ఆయ‌న కొత్త‌గా ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నా.. పాత నేత‌ల‌కంటే ఎక్కువ‌గా పిఠాపురాన్ని అభివృద్దిలో ప‌రుగులు పెట్టిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ర‌హ‌దారుల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతున్నారు. మెజారిటీ పంచాయ‌తీల్లో ప‌నులు 80 శాతం వ‌ర‌కు పూర్త‌య్యాయి. ఇక‌, ఇంటింటికీ తాగునీటి కోసం అల్లాడిన కుటుంబాల‌కు జ‌ల‌జీవ‌న్ మిష‌న్‌ను చేరువ చేశారు. అలాగే.. ఇప్పుడు ప‌ట్ట‌ణాల‌పై దృష్టిపెట్టారు. సుదీర్ఘ‌కాలంగా అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక అల్లాడుతున్న పిఠాపురం ప‌ట్ట‌ణానికి తాజాగా రు. 200 కోట్ల‌ను కేటాయించారు.

వీటితో పిఠాపురం పట్టణంలో మురుగు నీటి సమస్య పరిష్కారం కానుంది. పిఠాపురం పురపాలకం పరిధిలో రోడ్లు, కాలువలు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులను కేటాయించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 2020-21 నుంచి 2025-26 వరకు 20 కోట్ల రూపాయ‌లు కేటాయించారు. వీటితో అభివృద్ధి పనులు వ‌డివ‌డిగా సాగుతున్నాయి. కాకినాడ ఎంపీ (జ‌న‌సేన‌) నిధులతో రూ. 50 లక్షల విలువైన మురుగునీటి కాలువ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆదర్శ రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవనానికి శ్రీకారం చుట్టారు.

ఇలా.. అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు పిఠాపురం ఇప్పుడు కేరాఫ్‌గా మారిపోయింది. ఎంతో మంది నాయ‌కులు గ‌తంలో గెలిచారు. కానీ, వారికి భిన్నంగా ఇక్క‌డ ఇప్పుడు ప‌నులు సాగుతున్నాయి. ఇవి నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే!. మ‌రోవైపు ప‌వ‌న్ ఆత్మీయ స్ప‌ర్శ.. ఇక్క‌డి వారి చెమ‌ర్చుతోంది. పండుగ‌లు, వేడుక‌ల సంద‌ర్భంగా ఇక్క‌డి మ‌హిళ‌ల‌కు చీర‌లు, సారెలు పంపుతున్నారు. ఏ క‌ష్టం ఉన్నా.. నేనున్నానన్న భ‌రోసా నింపుతున్నారు. దీంతో మ‌హిళ‌లే కాదు.. అన్నివ‌ర్గాల‌కు ఇప్పుడు ప‌వ‌న్.. చేరువ అయ్యారు. నిజానికి వైసీపీ నాయ‌కురాలు వంగా గీత మాత్రం ప‌వ‌న్ ఇంత‌లా చేస్తార‌ని ఊహించ‌లేదు. అంద‌కే.. `విమ‌ర్శించాలంటే స‌రుకు లేదు. వివాదం చేద్దామంటే ఛాన్స్ లేదు. పాపం.. గీత మాత్రం ఏం చేస్తారు..` అనేది పిఠాపురం టాక్‌..!