త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ లోకల్ వార్ లో ఫైట్ కు ఇటు కూటమి పార్టీలు..అటు వైసీపీ రెడీ అవుతున్నాయి. అయితే, ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గంలో అక్కడి వైసీపీ ఇంఛార్జ్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ పై సొంత పార్టీలో సైతం విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యన్నారాయణ స్పందించారు.
ఊళ్లలో వైసీపీ హయాంలోనూ ఏకగ్రీవాలు జరిగాయని, ఇప్పుడు కూడా జరుగుతాయని బొత్స చెప్పారు. అయితే, అవి ప్రభుత్వాలు చేసే ఏకగ్రీవాలు అని, పార్టీల పరంగా, రాజకీయ లబ్ధి కోసం ఏకగ్రీవాలు జరగకూడదని జగన్ చెప్పారని స్పష్టం చేశారు.
ఊరు అభివృద్ధి కోసం జరిగే ఏకగ్రీవాలు, రాజకీయపరంగా లాలూచీ పడే ఏకగ్రీవాలు..ఇవి రెండూ వేరని అన్నారు. అధికార పార్టీ ప్రలోభ పెట్టి, వ్యవస్థలను, పోలీసులను అడ్డుపెట్టుకొని జరిపే ఏకగ్రీవాలకు వైసీపీ వ్యతిరేకం అని చెప్పారు. వాటికి భయపడకూడదని, పోరాడాలని జగన్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం అని తెలిపారు.
వాస్తవానికి, వైసీపీ హయాంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ భయపెట్టి, లాలూచి పడి చేసినవేనని విమర్శలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులను గదుల్లో పెట్టి తాళాలు వేసి నామినేషన్ వేయకుండా చేసిన ఘటనలు కోకొల్లలు. అటువంటిది, ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు జరగకూడదు అని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుంది అన్న విషయం జగన్ మరచిపోయినట్లున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
