లోకేష్… ట్విట్టర్ ని కూడా వదలట్లేదు

మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్టరీ పెడితే ప్రభుత్వం అన్నీ విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చి సదరు పారిశ్రామికవేత్తను రాష్ట్రానికి ఆహ్వానించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. చిత్తశుద్ధి కలిగిన నాయకుడిగా రాష్ట్రం కోసం మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని నేటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇంతకూ ఏమి జరిగిందంటే…

తమిళనాడుకు చెందిన చంద్రు రాజేంద్రన్ అనే పారిశ్రామికవేత్త ప్రోక్యూరియా అనే ఏఐ ఆధారిత మేనేజ్డ్ సోర్సింగ్ కంపెనీ వుంది. అమెరికా, యూకే, కెనడా, ఐరోపా వంటి దేశాల కొనుగోలుదారులు ఇండియా నుంచి ఇంజనీరింగ్ విడిభాగాలు కొనుగోలు చేసేందుకు సహకరిస్తుంది. ఏయిరోడొనేక్స్ టెక్నాలజీ అనే మరో కంపెనీ కూడా వుంది. తమ మేజర్ తయారీ క్లయింట్లలో ఒకరు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో డ్రోన్ తయారీ కంపెనీ పెట్టేందుకు ఆసక్తిగా వున్నారని, ఏ రాష్ట్రంలో కంపెనీ పెడితే బాగుంటుందో సూచించాల్సిందిగా ఎక్స్ ఖాతాలో ఆగస్టు చివరిలో ఒక పోస్టు పెట్టారు. వేరే నాయకులు ఎవరైనా ఇలాంటి పోస్టు చూసినా పెద్దగా పట్టించుకునేవారుకాదు. కానీ లోకేష్ మాత్రం వెంటనే స్పందించారు.

ఈ పోస్టుకు కొన్ని గంటల వ్యవధిలోనే మంత్రి లోకేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి, మేము అన్ని విధాలుగా సహకారం అందిస్తాం అంటూ రిప్లయ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్ సిటీ 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తుందని వివరించారు. డ్రోన్ రంగానికి ప్రత్యేక సబ్సిడీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డును సంప్రదించమని సలహా ఇచ్చారు.

మంత్రి లోకేష్ స్పందనకు పారిశ్రామికవేత్త చంద్రు రాజేంద్రన్ ఆశ్చర్య పోయారు. ఒక యువ మంత్రి పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఇంత స్పీడ్ గా వ్యవహరించడం సంతోషం కలిగించిందని ఎక్స్ లో మెసేజ్ చేశారు. నూతన పెట్టుబడులను ఆకర్శించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న వేగానికి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణం వలన తమ పరిశీలన జాబితాలో తొలి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ కు ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఏపీ ఈడీబీని సంప్రదించనున్నట్లు ప్రకటించారు.

కేవలం ఒక మెసేజ్ ద్వారా రాష్ట్రానికి 300 కోట్ల రూపాయల పరిశ్రమ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారని మంత్రి లోకేష్ చొరవను పారిశ్రామికవేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. లోకేష్ బాధ్యతలను చేపట్టిన తర్వాత choose Speed – ChooseAP నినాదంతో పెట్టుబడుల ఆకర్షణలో వేగవంతమైన చర్యలు చేపడుతున్నారని, ఫలితంగా అనేక సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని చెబుతున్నారు.

ఐటి పెట్టుబడుల శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2025 నుంచి 2026 వరకు అమెరికా, కెనడా, దక్షిణ కొరియా, రష్యా దేశాల్లో పర్యటించారు. ప్రతిష్టాత్మక కంపెనీలతో చర్చలు జరిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేశారని ఒక పారిశ్రామికవేత్త తెలిపారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరమని వ్యాఖ్యానించారు.