తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. కేవలం అభివృద్ధి పనులు, ప్రభుత్వ పాలనకే ఆయన పరిమితం కాకుండా.. వివిధ పండుగలు, సందర్భాలను అనుసరించి ఇక్కడి వారికి చేరువ అవుతున్నారు. గత దసరా సమయంలో ఇక్కడి మహిళలకు 7 వేలకుపైగా చీరలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని 3 వేల మంది ఆడపడుచులకు.. ఆయన చీరలు, స్వీట్స్ పంపిణీ చేశారు.
ప్రస్తుతం ఆయుర్వేద చికిత్స నిమిత్తం కేరళలో ఉన్న పవన్ కల్యాణ్.. పార్టీ నాయకులకు ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం రాఖీ పండుగను పురస్కరించుకుని స్థానికంగా గుర్తించిన మహిళలకు ఈ చీరలను, స్వీట్స్ను పంపిణీ చేయడం గమనార్హం. ఇక, ఎంపిక విషయానికి వస్తే.. ప్రభుత్వం నెల నెలా ఇస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల జాబితా ప్రకారం అర్హులైన మహిళలను ఎంపిక చేశారు. సుమారు 3 వేల మంది మహిళలకు చీరలు అందించారు. వీరంతా 45 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. అలాగే.. ప్రభుత్వ పింఛను రికార్డుల ప్రకారం.. వీరిలో వితంతువులు, భర్తకు దూరంగా ఉన్న లేదా.. కుటుంబాలు లేని అవివాహిత ఒంటరి మహిళలు కావడం గమనార్హం.
పవన్ సందేశం..
గొల్లప్రోలు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమానికి ఎంపికైన మహిళలను ప్రత్యేక బస్సుల్లో తీసుకువచ్చారు. వీరికి పవన్ కల్యాణ్ మెసేజ్ను చదివి వినిపించారు. సమాజంలో ఆత్మీయ భరోసా కరవైన ఒంటరి మహిళల జీవితాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో అత్యంత గౌరవప్రదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపోసినట్టు పవన్ పేర్కొన్నారు. సమాజంలోని మహిళల పట్ల మరింత గౌరవం పెరిగేందుకు రాఖీ పౌర్ణమి వంటి పవిత్ర పండుగలు దోహద పడతాయని ఆయన తెలిపారు.
అనంతరం.. గొల్లప్రోలు నగర పంచాయతీ.. కమిషనర్ దివిజతో కలిసి.. స్థానిక జనసేన పార్టీ నాయకులు మహిళలకు రాఖీలు, చీరలు, స్వీట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు పాల్గొనలేదని పేర్కొన్నారు. అలానే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉన్నారు. దీనిని కేవలం మహిళల సంతోషం. వారి గౌరవం ఇనుమడించేలా మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates