డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. జగన్..నువ్వే టైం, డేట్ ఫిక్స్ చెయ్. పులివెందులకు రమ్మంటావా.. తాడేపల్లికి రమ్మంటావో చెప్పు. డీఎస్సీ మీద చర్చించడానికి నేను రెడీ.. నువ్వు సిద్ధమా చెప్పమంటూ లోకేష్ చేసిన సవాల్ తో ఒంగోలు దద్దరిలింది. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో పర్యటలో కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రేపింది.
గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఒక శాపం వుంది. నిజం మాట్లాడితే ఆయన తల వేయి ముక్కలవుతుందని జ్యోతిష్యులు చెప్పారంటూ ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో ఒంగోలులో నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపించేదని, అంతర్గత రోడ్లు శిధిలావస్థలో ఉండేదన్నారు. నగర ప్రజలు మంచి నీటికి అల్లాడారని విమర్శలు గుప్పించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, నగరం రూపురేఖలు మారిపోయాయని కితాబిచ్చారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు కలిసి మెలిసి పని చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వున్నా లేకపోయినా మనం మన బలంపైన ఆధారపడాలని కార్యకర్తలకు ఉద్భోదించారు. పార్టీలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదని, అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఈగోలు లేకుండా నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని, స్థానిక ఎన్నికల్లో సైకిల్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
లోకేష్ పర్యటనకు జనం భారీగా తరలి వచ్చారు. ఉత్తరాన త్రోవగుంట నుంచి దక్షిణాన మినీ స్టేడియం, సంఘమిత్ర హాస్పిటల్ వరకు ఎటు చూసినా జనం కిటకిటలాడారు. నగరంలోని ప్రధాన వీధుల్లో రద్దీ కనిపించింది. మహిళలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. లోకేష్ పర్యటనలో డీఎస్సీ అభ్యర్థులు కృతజ్ఞతలు చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. లోకేష్ పర్యటనకు వచ్చిన ఉహించని స్పందన లోకల్ ఎన్నికల్లో మంచి ప్రభావం చూపిస్తుందని తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates