“కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ చూస్తుంది. పార్టీ తీసుకునేచర్యలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే.“ అని మంత్రి కొండాసురేఖ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా మంత్రులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ వ్యవహారం చర్చకు వచ్చింది. “సురేఖమ్మ వ్యవహారం పార్టీ క్రమశిక్షణ సంఘం చూసుకుంటుంది. నేనైనా ఎవరైనా క్రమశిక్షణ సంఘానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇక్కడ ఎవరి వ్యక్తిగత వ్యవహారాలు ఉండవు.“ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
అదేసమయంలో పార్టీలో ఎవరి గురించీ తాను ప్రత్యేకంగా మాట్లాడబోనన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని విభాగాలకు ప్రత్యేక వ్యవస్థ ఉందని రేవంత్ చెప్పారు. నేతలు గాడి తప్పుతున్నారని తెలిస్తే.. ఫిర్యాదులు వస్తే.. క్రమశిక్షణ సంఘం ముందు పెడతారని, సంఘంలో సభ్యులు అన్నీ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారని.. తానేమీ ఈ విషయంలో జోక్యం చేసుకునేది లేదని పేర్కొన్నారు. క్రమశిక్షణ సంఘంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు ఉన్నారని.. వారే అన్నీ చూసుకుంటారని తెలిపారు. కాగా.. సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తల్లి, మంత్రి సురేఖకు క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చారు.
వదిలేస్తారా?
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే..మంత్రి సురేఖను గట్టిగా హెచ్చరించి వదిలేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది. మహిళా మంత్రి కావడంతోపాటు వరంగల్పై పట్టున్న నాయకురాలు కావడంతో ఆమె వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నా.. చర్యల విషయంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వరాదన్న భావన కనిపిస్తోంది.
ఇప్పటికే బీఆర్ ఎస్ వ్యూహాలు భిన్నంగా ఉండడం.. కాంగ్రెస్ పార్టీ నేతలు బలహీనపడుతున్నారన్న వాదనను బలంగా తీసుకువెళ్తున్న క్రమంలో సురేఖను గట్టిగా హెచ్చరించి వదిలేస్తారన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆమె కుమార్తె సుస్మితను పార్టీకార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న హెచ్చరికలు చేయనున్నారని అంటున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తన జోక్యం లేదని చెప్పడం ద్వారా వివాదాన్ని దాదాపు ముగించే దిశగా చర్యలు చేపట్టారన్న చర్చ సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates