భారత్‌పై 100 శాతం టారిఫ్.. ఇప్పుడు ట్రంప్ చేతిలోనే!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు అమెరికా నుంచి మరో టారిఫ్ ముప్పు దగ్గరైంది. రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు తీసుకొచ్చిన కీలక ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లు 262-159 ఓట్లతో పాస్ అయింది. సెనేట్ ఇప్పటికే గత నెలలో దీనికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే ఇది చట్టంగా మారుతుంది.

ఈ బిల్లులో భారత్‌కు సంబంధించిన కీలక అంశం రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇవ్వనున్నారు. భారత్‌తో పాటు చైనా కూడా రష్యా ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఉంది.

అయితే బిల్లు చట్టంగా మారిన వెంటనే భారత వస్తువులపై 100 శాతం టారిఫ్ పడిపోదు. ఎంత టారిఫ్ విధించాలి, ఎప్పుడు అమలు చేయాలి అనే విషయంలో ట్రంప్‌కు అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు చమురు, గ్యాస్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించడమే ఈ బిల్లు అసలు టార్గెట్.

రష్యా ఇంధన రంగంతో పాటు బ్యాంకులు, రక్షణ రంగం, ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకుని చమురు రవాణా చేస్తున్న నౌకలను కూడా కొత్త చర్యలు లక్ష్యంగా చేసుకుంటాయి. భారత్‌కు రష్యా చమురు కీలకంగా మారడానికి ధర కూడా ప్రధాన కారణం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో తక్కువ ధరకు లభించిన రష్యా క్రూడ్‌ను భారత రిఫైనరీలు భారీగా కొనుగోలు చేశాయి. అమెరికా మాత్రం ఈ కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆదాయం కొనసాగుతోందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఇప్పుడు బిల్లు ట్రంప్ సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్తోంది. ఆయన సంతకం తర్వాత భారత్‌పై కొత్త టారిఫ్ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నది చూడాలి. మరోవైపు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికాలో జరిగే జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.