కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అంతకుముందే ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ కి ఒక పదవి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తుంది. టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుంది. యనమలకు గవర్నర్ పదవి దాదాపుగా ఖరారైనట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది.
పదవీ కాలం ముగిసిన వారితో పాటుగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల గవర్నర్లను మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, బీహార్ రాష్ట్రాల గవర్నర్లను మార్చానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పీకర్ గా రాణించిన యనమల ఆ తర్వాత ఆర్ధిక మంత్రిగా కూడా పనిచేశారు.
రాజ్యాంగ వ్యవహారాల మీద మంచి కూడా వుంది. దీన్ని పరిగణలోకి తీసుకొని యనమల రామకృష్ణుడి పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. రాజ్యాంగ వ్యవహారాలు, అసెంబ్లీ నిర్వహణ మీద మంచి పట్టున్న యనమలను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ కు ఒక మంచి గవర్నర్ అవసరమని భావిస్తున్న కేంద్రం యనమలను బీహార్ కు పంపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
యనమల కూతురు దివ్య ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి ఎమ్మెల్యే గా ప్రాతినిద్యం వహిస్తున్నారు. యనమల టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా వున్నారు. అయినప్పటికీ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో టచ్ లో వున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా యనమల సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీసీల్లో పట్టున్న యనమలకు గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా టీడీపీకి బీసీల్లో వున్న క్రేజ్ ను నిలుపుకోవచ్చన్నది సీఎం ఆలోచనగా చెబుతున్నారు.
టీడీపీ నుంచి మరికొందరు సీనియర్ నాయకులు కూడా గవర్నర్ పదవి మీద ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. రాజకీయ సమీకరణల్లో భాగంగా చంద్రబాబు మాజీ స్పీకర్ యనమల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కేఇ కృష్ణమూర్తి, ప్రతిభా భారతిలకు స్థాయికి తగిన పదవి ఇచ్చి గౌరవించాలని నిర్ణయించినట్లు వినికిడి.
Gulte Telugu Telugu Political and Movie News Updates