వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే ఉంటుందా? ఇవీ.. ఇప్పుడు చర్చకు వస్తున్న అంశాలు. సంక్షేమం ప్రాతిపదికనే రాజకీయాలు చేస్తున్న వైసీపీకి స్థిరమైన ఓటు బ్యాంకు కొనసాగడం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా బీసీలు అదేవిధంగా మైనారిటీల్లోని కొన్ని వర్గాలు అండగా ఉన్నాయి. దీంతో సంక్షేమం ప్రాతిపదికన కాకుండా సెంటిమెంటు.. చంద్రబాబు పట్ల ఉన్న అభివృద్ధి, విజన్ నాయకుడి ముద్రలు బలంగా పనిచేస్తున్నాయి.
మరి వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో వాస్తవానికి వైసీపీకి వచ్చింది.. 39.35 శాతం ఓటు షేర్ మాత్రమే. సరే.. దీనిని 40 శాతం అనుకున్నా.. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ఉద్యోగాలు వంటివి కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకు స్థిరంగా వచ్చే ఎన్నికల వరకుకొనసాగుతుందా? అనేది చర్చనీయాంశం. పైగా.. ఇప్పుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చారు.
అదే సమయంలో ఎస్సీ, ఎస్టీల ప్రాతిపదిక, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన ఇలా.. అనేక అంశాలు వైసీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఓటు బ్యాంకు స్థిరంగా ఉండకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే.. వైసీపీ పెట్టుకున్న అధికార కలలు ఏమేరకు సాకారం అవుతాయన్నది కూడా ప్రశ్నగా మారుతోంది. దీనికితోడు.. కూటమి పార్టీల ఐక్యత పెరుగుతుండడంతో.. ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉండకపోవచ్చన్న అంచనా కూడా వినిపిస్తోంది.
మొత్తంగా వైసీపీ ఓటు బ్యాంకులో అయితే మార్పులు తప్పవన్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ పథకాలు.. గతంలో అమలైనట్టుగానే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. పోనీ.. జగన్ చెబుతున్నట్టుగా కొందరికి అందకపోతే అందకపోవచ్చు. కానీ, మెజారిటీ వర్గానికి అప్పుడు జరిగినట్టే ఇప్పుడు కూడా న్యాయం జరుగుతోంది. దీంతో ఆయా వర్గాలు ఖచ్చితంగా కూటమికే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు పెరగకపోగా.. తగ్గుముఖం పడుతుందన్న లెక్కలు వస్తున్నాయి. దీనిపై వైసీపీలోనూ అంతర్గత చర్చ సాగుతున్నా.. బయటకు మాత్రం అంగీకరించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates