తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీ స్ట్రాంగ్ వార్నింగ్‌…?

తెలంగాణ బీజేపీలో ఆధిప‌త్య పోరు, వ‌ర్గ విబేధాల‌తో పార్టీ జాతీయ నాయ‌క‌త్వం సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ నబీ ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చి మ‌రీ రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేశారు. నితిన్ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెళ్లాక కొంద‌రు పెద్ద‌ల‌ను ఇక్క‌డ‌కు పంపి ఇక్క‌డ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త పెంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ త‌ర్వాత రాష్ట్ర పార్టీలో కొంద‌రు కీల‌క నేత‌ల‌ను ఢిల్లీకి పిలిచి అక్క‌డే ఆయ‌న చెప్పాల‌నుకున్న‌ది ఓపెన్‌గానే చెప్పేశార‌ట‌. పార్టీలో ఇక‌పై అంత‌ర్గ‌త విబేధాలు త‌గ్గించుకోక‌పోతే సీరియ‌స్‌గా తామే నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని కూడా చెప్పార‌ట‌.

నితిన్ చాలా సౌమ్యుడిగా ఉంటాడు. అలాంటిది రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు ఇంత తీవ్ర స్వ‌రంతో వార్నింగ్ ఇవ్వ‌డంతో పార్టీ నేత‌లు సైతం ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇత‌ర కీల‌క నేత‌ల మ‌ధ్య అస్స‌లు స‌ఖ్య‌త లేదు. ఇక్క‌డ ఎవ‌రికి వారే త‌మ‌కు తాము నాయ‌కులుగా ఫీల‌వుతున్నారు. ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌లేపుతున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లు.. ఆ త‌ర్వాత పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. అయితే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఏకంగా 8 లోక్‌స‌భ స్థానాలు వ‌చ్చినా అది మోదీ మ‌హిమే అన్న‌ది ఓపెన్ సీక్రెట్‌.

8 లోక్‌స‌భ స్థానాలు గెలిచినా పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డింది లేదు… క‌నీసం 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ నుంచి పోటీ చేసే బ‌ల‌మైన ఎమ్మెల్యే అభ్య‌ర్థులు కూడా లేని ప‌రిస్థితి. చివ‌ర‌కు బూత్ లెవ‌ల్ ఏజెంట్లు కూడా అన్ని చోట్లా బ‌లంగా లేద‌న్న నివేదిక‌లు కూడా పార్టీ అధినాయ‌క‌త్వం ద‌గ్గ‌ర ఉన్నాయి. బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుకూల ధృక్ప‌థం ఉన్నా కూడా పార్టీ ఎందుకు పుంజుకోలేక‌పోతోంది ? అధికారం లేదా క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌లోకి ఎందుకు రాలేక‌పోతోందంటే కేవ‌లం నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరే కార‌ణం అని పార్టీకి క్లారిటీ ఉంది.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా గ‌ట్టిగా రెండేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అంత‌కంటే ముందు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని మూడు కార్పొరేష‌న్లు, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. ఈ రెండు చోట్ల బీజేపీ స‌త్తా చాట‌క‌పోతే ఆ ప్ర‌భావం ఖ‌చ్చితంగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఉంటుంది. ఈ క్ర‌మంలోనే నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరుకు చెక్ పెట్ట‌క‌పోతే పార్టీ అధికారంలోకి రావ‌డం సంగ‌తేమో గాని.. ఇప్పుడున్న సీట్లు కూడా పోతాయ‌న్న ఆందోళ‌న‌తోనే బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం సీరియ‌స్ వార్నింగులతో గ్రూపుల గోల‌కు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైంది.