బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతరా కాంగ్రెస్ నాయకులు సందర్బం వచ్చినప్పుడల్లా ఈ ఆరోపణలు చేస్తూనే వున్నారు. దీన్ని బీఆర్ఎస్ ఖండిస్తూ వస్తుంది. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు ఈ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
హరియాణాలోని సోనిపట్లో ఉన్న జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో బుధవారం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్- ది స్టోరీ ఆఫ్ ఏ స్టార్టప్ స్టేట్ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. వర్శిటి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్బంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసిందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని కేటీఆర్ గుర్తుచేశారు. గెలిచినా, ఓడినా తమ సిద్ధాంతం, వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు .
ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, మొత్తం లోక్సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచినట్లయితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో అభ్యంతరం ఉండదన్నారు. అంత మాత్రాన బీజేపీతో రహస్య స్నేహమో, తెరవెనక ఒప్పందమో ఉందని విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ విజ్ఞతకు వొదిలేస్తున్నా అని చెప్పారు. డి లిమిటెషన్ ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తే సహించేది లేదన్నారు.
కేటీఆర్ ప్రకటనతో రానున్న ఎన్నికల్లో తెలంగాణాలో త్రిముఖ పోటీ తప్పదని తేలిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న సంగతి తేలిపోయింది. కవిత సొంత పార్టీ టీఆర్ఎస్ ప్రయాణం ఎటో తేలాల్సి వుంది. టీఆర్ఎస్ పార్టీ వల్ల ఏపార్టీకి లాభం కలుగుతుంది, ఏ పార్టీ కొంప ముంచుతుందన్నది రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates