నిన్న గ్రూప్‌-1, నేడు పోలీస్‌: ఏపీ స‌ర్కారు దూకుడు!

నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ విష‌యంలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. తాజాగా బుధ‌వారం ఉద‌యాన్నే 2050 పోలీసు ఉద్యోగాల‌కు సంబంధించి పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వీటిలో ఎస్ఐ పోస్టులు: 378. కానిస్టేబుల్ పోస్టులు: 1,156, ఫైర్‌మెన్ పోస్టులు: 158 (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖ), జైలు వార్డర్ పోస్టులు: 171 (జైళ్లు, సంస్కరణ సేవల శాఖ), కమ్యూనికేషన్స్, మెకానిక్స్, డ్రైవర్లు ఇతర ప్రత్యేక పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి.

ఏపీలో కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది రెండో విడ‌త పోలీసు రిక్రూట్‌మెంటు కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది 6 వేల మంది కానిస్టేబుళ్ల‌ను నియ‌మించారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు నియామ‌క ప‌త్రాలు అందించారు. ఆ స‌మ‌యంలోనే వ‌చ్చే ఏడాది(2026) మ‌ళ్లీ రిక్రూట్‌మెంటు చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అన్న‌ట్టుగానే తాజాగా బుధవారం 2050 పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంటు నోటిఫికేష‌న్‌ను ఇచ్చారు.

మ‌రోవైపు.. మంగ‌ళ‌వారం ఏకంగా 890 పోస్టుల‌తో కూడిన జాబ్ షెడ్యూల్ను ప్ర‌క‌టించారు. వీటిలో గ్రూప్-1 పోస్టులు 163 వ‌ర‌కు ఉన్నాయి. వీటిని ఈ ఏడాదే భ‌ర్తీ చేయ‌నున్నారు. అక్టోబ‌రు 6వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌నున్నారు. దీంతో కూట‌మి స‌ర్కారు ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్న‌ట్టు అయింద‌ని నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, త్వ‌ర‌లోనే ద‌స‌రా ను పుర‌స్క‌రించుకుని డీఎస్సీ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను కూడా చేప‌ట్ట‌నున్నారు. ఈ ద‌ఫా 3 వేల‌కుపైగా ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

వైసీపీ హ‌యాంలో..

వైసీపీ ఐదేళ్ల కాలంలో ఒక్క మెగా డీఎస్సీని కూడా నిర్వ‌హించ‌లేద‌ని నిరుద్యోగులు నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. ఇక‌, 2018నాటి గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌ను చేప‌ట్టినా.. దానిలో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ హైకోర్టు ప‌రిధిలో ఉంది. ఇక‌, స‌చివాల‌య సిబ్బందిని మాత్రం వైసీపీ హ‌యాంలో నియ‌మించారు. పోలీసు స‌హా రెవెన్యూ నుంచి ఏ విభాగంలోనూ ఎలాంటి రిక్రూట్‌మెంటు చేప‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.