ప్రపంచంలోని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరంలో తొలిసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హౌతీ తిరుగుబాటుదారుల వరస దాడుల నేపథ్యంలో సౌదీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉమ్రా యాత్ర కోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తరలివచ్చిన భక్తులను అలెర్ట్ చేశారు. వైమానిక దాడులకు సంబందించి హెచ్చరికలు జారీ చేశారు.
సౌదీ అరేబియాపై యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మక్కా, జెడ్డా, తాయిఫ్ సహా పలు ప్రాంతాల్లో సౌదీ పౌర రక్షణ విభాగం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. మక్కా నగరానికి అత్యంత సమీపంలోకి వచ్చిన డ్రోన్ కూల్చివేసినట్లు సమాచారం. అందుకే హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే మక్కాలో ప్రమాదం తొలగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో టెన్షన్ తొలిగినట్లయ్యింది.
మక్కాను లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రయత్నించినట్టు వచ్చిన వార్తలను హౌతీలు ఖండించారు. హౌతీ రాజకీయ విభాగానికి చెందిన హాజెమ్ అల్-అసద్ సౌదీ ఈ ఆరోపణలను తిరస్కరించారు. హౌతీలు అలాంటి తప్పు చేయదని స్పష్టం చేశారు. అయితే మక్కాలో హెచ్చరికలకు ఒక రోజు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. మక్కాకు దక్షిణంగా వచ్చిన ఓ హౌతీ డ్రోన్ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్టు అనధికార వర్గాలు వెల్లడించాయి.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరమైన మక్కాలో వైమానిక ముప్పు హెచ్చరిక వెలువడటం ఇదే తొలిసారి. ఈ వార్త ఒక్క సౌదీ ప్రభుత్వాన్నే కాకుండా యావత్ ముస్లిం సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి సౌదీ మీద దాడులు జరుగుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనన్న అనుమానాలు ముస్లిం సమాజాన్ని వేదిస్తున్నాయి. ఇప్పుడు మక్కాలో హెచ్చరికల జారీ కొంత కలవరపాటుకు గురిచేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates