20 ఏళ్ల త‌ర్వాత ఎన్నిక‌లు… ఎమ్మెల్యేకు బిగ్ టెస్టే.. !

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్ల త‌ర్వాత‌.. ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి లో స్థానిక‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల రాజకీయం, సమీకరణాలు చాలా ఆసక్తికరంగా మారాయి. దాదాపు 20 ఏళ్ల నుంచి వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. రాజాం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి కూట‌మి పార్టీల‌కు ముఖ్యంగా టీడీపీకి అత్యంత అనుకూలంగా ఉందని అంటున్నారు. గత ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ వ్యూహాలపై వ్యూహాలు వేస్తున్నారు. ఇది ఆయ‌న రాజ‌కీయాల‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణులను ఆయ‌న నిర్విరామంగా క‌లుస్తున్నారు. వారిలో జోష్ నింపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, దాదాపు 20 ఏళ్లుగా ఎన్నికలు జరగని రాజాం మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు ఎమ్మెల్యే కొండ్రు తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.

వైసీపీలో గ్రూపులు
2014, 2019 ఎన్నికల్లో రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజయం సాధించింది. అయితే, 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను కాదని డాక్టర్ తేలే రాజేష్‌ను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీ క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. ప్రస్తుత స్థానిక ఎన్నికల తరుణంలో రాజాం వైసీపీలో నేతల మధ్య సమన్వయం లోపించింది. గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. కొంద‌రు నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో వైసీపీ ప‌రిస్థితి దారుణంగా మారింద‌ని అంటున్నారు.

20 ఏళ్లుగా ఎందుకు..?
రాజాం మునిసిప‌ల్ ఎన్నిక‌లు 20 ఏళ్లుగా జ‌ర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం.. కోర్టు వివాదాలు, గ్రామాల విలీనం వంటివే. రాజాం నగర పంచాయతీగా మారిన తర్వాత దాదాపు రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికలు జరగలేదు. సుదీర్ఘ కాలం తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడంతో, పట్టణంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటు అధికార కూటమి, అటు ప్రతిపక్ష వైసీపీ ఈ మున్సిపల్ పీఠాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రాజాం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి, ఆమదాలవలస మండ‌లాల్లో టీడీపీ కూట‌మి బ‌లంగా ఉంది. మ‌రోవైపు.. వైసీపీ కుస్తీలు ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేకు ఇది ప్ల‌స్ కావ‌చ్చ‌ని అంటున్నారు.