వైసీపీలో చిచ్చు.. ర‌గులుతున్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు

Hop in for a free ride with

అధికార వైసీపీలో నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, ఆధిప‌త్య పోరు కామ‌న్‌గా మారింది. అయితే.. మ‌రీ ముఖ్యంగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి నిత్యం ర‌గులుతూనే ఉండ‌డం పార్టీ పెద్ద‌ల‌కు కూడా త‌ల‌నొప్పి గా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన వారిని వైసీపీకి మ‌ద్ద‌తు దారులుగా చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇలా వ‌చ్చిన వారిలో ఇద్ద‌రు పార్టీకి త‌ల‌నొప్పిగా మారారు. అదే స‌మయంలో సొంత పార్టీ త‌ర‌ఫునే గెలిచిన నాయ‌కులు కూడా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిప‌త్య పోరు సాగిస్తున్నారు. ఇలాంటి చోట్ల కూడా పార్టీ ఇబ్బందులు ప‌డుతోంది.

ఇక‌, ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి రెండు చోట్ల వైసీపీ నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త వివాదాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. దీంతో ఆయా స‌మ‌స్య‌లు ఎలా ప‌రిష్క‌రించాల‌నే విష‌యం సీనియ‌ర్ల‌కు పెద్ద సంక‌టంగా ప‌రిణ‌మించింద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌ధానంగా కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం, ప్ర‌కాశం జిల్లా చీరాల‌, గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌, అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌న్న‌వరంలో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ.. వైసీపీకి అనుకూలంగా మారిపోయారు.

అయితే.. గ‌న్న‌వ‌రంలో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు వ‌ర్గం బ‌లంగా ఉంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యం ఇప్ప‌టి నుంచే వీరిమ‌ధ్య వివాదానికి కార‌ణంగా మారింది. ఇది అడుగ‌డుగునా.. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుకు దారితీస్తోంది. ఇటీవ‌ల ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మం కోసం.. ప్రొటొకాల్ ప్ర‌కారం ఎమ్మెల్యేకు ఆహ్వానం అందింది. ఆయ‌న కూడా హాజ‌ర‌య్యారు. అయితే.. ప‌లు గ్రామాల్లో వంశీ రావొద్దంటూ.. బోర్డులు వెలిశాయి. గ్రామ‌స్తులు కూడా వంశీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు హీటెక్కాయి. దీని వెనుక యార్ల‌గ‌డ్డ ఉన్నార‌ని వంశీ.. వంశీ రాజ‌కీయాలు న‌చ్చ‌క‌పోవ‌డంతో.. ప్ర‌జ‌లే తిరుగుబాటు చేస్తున్నార‌ని యార్ల‌గ‌డ్డ వ‌ర్గం ఆరోపిస్తున్నాయి. ఫ‌లితంగా పార్టీపై ప్ర‌భావం ప‌డుతోంది.

ఇక‌, చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం.. త‌ర్వాత కాలంలో కుమారుడు వెంక‌టేష్‌ను వైసీపీలోకి పంపించి తాను కూడా వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారారు. ఇది కూడా ఇక్క‌డ టికెట్ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసింది. వైసీపీలో ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ స‌హా .. టీడీపీ నుంచి కొన్నాళ్ల కింద‌ట వ‌చ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్న పోతుల సునీత‌ల మ‌ధ్య తీవ్ర‌ వివాదంగా మారింది. దీంతో వైసీపీ రాజ‌కీయం ఇక్క‌డ కూడా తార‌స్థాయిలో వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.

అదే విధంగా.. గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుంటే.. ఇక్క‌డ మ‌రింత చిత్ర‌మైన రాజ‌కీయాలు సాగుతున్నాయి. పేట నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ త్యాగం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇక్క‌డ నుంచి ఆ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం సాధించిన విడ‌ద‌ల ర‌జ‌నీ.. త‌నే స‌ర్వ‌ స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల పేద‌ల‌కు ఇళ్ల పంపిణీ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్ర‌భుత్వాన్ని పొగుడుతూ.. మ‌ర్రి వ‌ర్గం భారీ క‌టౌట్లు ఏర్పాటు చేసింది. అయితే, ర‌జ‌నీ వ‌ర్గం వాటిని రాత్రికి రాత్రి తొల‌గించింది. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ర్రి ఎక్క‌డ బ‌ల‌ప‌డ‌తారో.. అనే భావ‌న‌తోనే ఆమె అలా చేయిస్తోంద‌ని రాజ‌శేఖ‌ర్ వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. దీంతో ఇక్క‌డ కూడా వైసీపీ రాజ‌కీయం రెండుగా చీలిపోయి.. ప్ర‌జ‌ల‌కు స‌రైన మెసేజ్ చేర‌డం లేదు.

ఇక‌, అనంత‌పురం జిల్లా హిందూపురం రాజ‌కీయం మ‌రో విధంగా ఉంది. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున బాల‌య్య విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్బాల్ ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. కానీ.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న న‌వీన్ నిశ్చ‌ల్‌.. త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హించి.. వ‌ర్గ పోరుకు దిగుతున్నారు. ఇక‌,.. ఇక్బాల్ కూడా మ‌రో వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజ‌కీయాలు న‌డిపిస్తున్నారు. ఫ‌లితంగా వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఇలా ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉండ‌డం, స‌రి చేసేందుకు ఎలాంటి వ్యూహం అనుస‌రించాలో కూడా తెలియ‌క‌పోవ‌డం వంటివి వైసీపీలో తీవ్ర గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నాయి.