భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా… అవన్నీ దాదాపుగా ఆరిపోయే దీపాలుగానే కనిపిస్తున్నాయి. వాటన్నింటికీ విరుద్ధంగా నాలుగు దశాబ్దాల క్రితం పుట్టిన తెలుగు దేశం పార్టీ మాత్రం ఎటికేడు తన బలాన్ని పెంచుకుంటూనే ఉంది. బలగాన్నీ పెంచుకుంటూ పోతోంది. ఓ ప్రాంతీయ పార్టీగా అవతరించిన టీడీపీ ఈ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి గల కారణమేమిటన్న విషయంపై అప్పుడప్పుడూ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ తరహా చర్చలకు పైన కనిపిస్తున్న ఫొటోనే సరైన సమాదానం అని చెప్పక తప్పదు. పార్టీలో నేతల మధ్య ఉన్న ఆత్మీయతలు, అధిష్ఠానం పట్ల నేతలకు ఉన్న అనుబంధం… వెరసి టీడీపీని బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగేలా చేసిందని చెప్పాలి.
ఎస్వీఎస్ఎన్ వర్మ.. ఈ పేరుకు ఎంతమాత్రం పరిచయం అక్కర్లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన నియోజవర్గం పిఠాపురంలో ఏళ్ల తరబడి టీడీపీకి కొమ్ము కాస్తూ వస్తున్న నేత. ఎన్నికల్లో విజయం దక్కినా, దక్కకున్నా… ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా… ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం పార్టీకి దూరంగా జరిగిన దాఖలానే లేదు. అంతేనా… ప్రభుత్వం, మిత్రపక్షాలు, పార్టీలో అవమానాలు ఎదురైనా కూడా ఆయన వెనక్కు తగ్గడం గానీ, వెనకంజ వేయడం గానీ, పార్టీకి దూరం జరగడం గానీ చేయట్లేదు. నిత్యం పార్టీ బలోపేతంపైనే ఆయన దృష్టి సారిస్తూ సాగుతున్నారు. ఈ తరహా నేతలే టీడీపీకి పెట్టని కోటగా నిలుస్తున్నారని చప్పాలి.
గత సార్వత్రిక ఎన్నికల్లో వర్మకు సీటు దక్కలేదు. జనసేన, బీజేపీలతో పొత్తు కారణంగా… ఏకంగా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… వర్మ సీటును ఆశించారు. విషయం తెలిసిన వెంటనే… టీడీపీ అధిష్ఠానం వర్మతో మాట్లాడగా… తన సీటును ఉన్నపళంగా త్యాగం చేసేశారు వర్మ. తనకు అవకాశం దక్కకపోయినా.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న రీతిలో సాగిన వర్మ… ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం కోసం శ్రమించారు. పవన్ ను తన నియోజకవర్గంలో బారీ మెజారిటీతో గెలిపించారు. ఆ తర్వాత తన సీటులో నుంచి గెలిచిన పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో వర్మ సంతోషపడ్డారు. పవన్ కారణంగా తన నియోజకవర్గం మరింతగా అభివృద్ది చెందుతుందని ఆయన ఆశించారు.
కట్ చేస్తే.. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య తరచూ వివాదాలు రాజుకుంటున్నాయి. ఇరు పార్టీల శ్రేణులు వాదులాటకు దిగుతున్నారు. కలహించుకుంటున్నారు. ఈ వ్యవహారాల్లో వర్మకు అధిష్ఠానం నుంచి మందలింపులు ఎదురు అవుతున్నాయి. అయినా వర్మ ఏమాత్రం పార్టీపై కోపగించుకోవడం లేదు. హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ దక్కకపోయినా ఆయన ఏమాత్రం బాధ పడటం లేదు. అధిష్ఠానంతో నిత్యం అభిమానంతోనే ఆయన సాగుతున్నారు. తాజాగా శనివారం విజయనగరంలో జరిగిన ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడికి వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఆయన కలిశారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న వర్మ… ఎంతో సంబరపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

