అఖిల ప్రియ‌కు సింప‌తీరాలేదు.. రీజ‌నేంటి? ఒంట‌ర‌య్యారా?

దూకుడు మంచిదే.. కానీ, ఆ దూకుడు అర్ధ‌వంతంగా ఉండాలి. అంద‌రూ మెచ్చేదిగా కూడా ఉండాలి. లేక‌పోతే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న‌దైన శైలిలో దూకుడు చూపించారు టీడీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌. గ‌ట్టి వాయిస్ వినిపించారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిత్యం ఏదో ఒక అంశాన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకునిదానిలోని లోపాల‌ను ఎత్తి చూపించారు.

సై-అంటే సై అంటూ.. స‌వాళ్లు కూడా విసిరారు. ఈ క్ర‌మంలో తాను చాలా దూకుడు చూపిస్తున్నాన‌ని.. జిల్లాలో ఎంతో మంది టీడీపీ నాయ‌కులు ఉన్నా.. అంద‌రిక‌న్నా తానే బాగా ప‌నిచేస్తున్నాన‌ని అఖిల ప్రియ భావించారు.

నిజ‌మే! అఖిల ప్రియ ఆలోచ‌న‌, ఆమె భావ‌న వాస్త‌వ‌మే. క‌ర్నూలులో కాక‌లు తీరిన టీడీపీ సీనియ‌ర్లు ఉ న్నా.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి టికెట్లు సాధించి పోటీ చేసిన వారున్నా.. వారెవ‌రూ.. ఎన్నిక‌ల అనంత‌రం.. ఈ త‌ర‌హా వాయిస్ వినిపించ‌లేద‌నే చెప్పాలి. అంతేకాదు, ఎవ‌రూ కూడా జ‌గ‌న్ స‌ర్కారుపై భూమా అఖిల ప్రియ మాదిరిగా కామెంట్ల‌ను కుమ్మ‌రించిందీ లేదు.

ఇక‌, పార్టీ త‌ర‌ఫున వాయిస్ అయినా .. వినిపించారా? జెండా ప‌ట్టుకుని చంద్ర‌బాబు పిలుపు మేర‌కు కార్య‌క్ర‌మాలు ఏమైనా నిర్వ‌హించారా? అంటే.. అది కూడా చాలా చాలా త‌క్కువేన‌ని పార్టీ చేప‌ట్టిన స‌ర్వేలో నే స్ప‌ష్ట‌మైంది. అంటే.. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే.. అఖిల ప్రియ దూకుడుకే మార్కులు ప‌డ్డాయి.

దీనిని బ‌ట్టి అటు పార్టీలోను, ఇటు ప్ర‌జ‌ల్లోను కూడా భూమా అఖిల‌కు సింపతీ రావాలి. ఆమె దూకుడుకు మంచి ఫాలోయింగ్ క‌నిపించాలి. మ‌రి అలా జ‌రిగిందా? సింప‌తీ ఏమైనా పోగై.. అఖిల‌కు ప్ల‌స్ అయిందా? అంటే.. లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం హ‌ఫీజ్ పేట భూ వివాదానికి సంబంధించి అరెస్ట‌యి జైల్లో ఉన్న అఖిల‌కు సానుభూతిగా ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు.

ఇక‌, టీడీపీ త‌ర‌ఫున కూడా పార్టీ అధినేత చంద్ర‌బాబు చెప్పాక‌.. ఎప్పుడో కానీ.. నాయ‌కులు స్పందించ‌లేదు. అలా స్పందించిన వారు కూడా చోటా నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి అఖిల చూపించిన దూకుడు ఆమెకు ప్ల‌స్ కాలేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఇన్నాళ్లు అఖిల చేసిన సేవ వృధాయేనా? అంటే.. దీనికి ప‌రిశీల‌కులు చెబుతున్న మాట ఒక్క‌టే..

దూకుడు ఉండాలి. కానీ.. సొంత పార్టీ నేత‌ల‌పై కూడా దూకుడు చూపిస్తే ఎలా? అన్నీ తానే అయి వ్య‌వ‌హ‌రించ‌డం సీనియ‌ర్ల‌ను కూడా లెక్క‌చేయ‌క పోవ‌డం, ఎవ‌రి స‌ల‌హాలు సూచ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం వంటివి అఖిల‌కు పెద్ద మైనస్‌లుగా మారాయ‌ని. దీంతో ఆమె క‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ .. ఎవ‌రూ సింప‌తీ చూపించ‌లేక పోతున్నార‌ని అంటున్నారు. నిజ‌మే క‌దా.. ఎంత బంగార‌పు ప‌ళ్లెం అయినా.. నిల‌బ‌డేందుకు ఆధారం అవ‌స‌రం అయిన‌ట్టే.. పార్టీలో సీనియ‌ర్లు, జూనియ‌ర్ల‌ను కూడా క‌లుపుకొని వెళ్లి ఉంటే.. ఎంతో కొంత సింప‌తీ ల‌భించేద‌నే విష‌యంలో సందేహంలేదు. మ‌రి ఈ పాఠం నుంచి అఖిల ఏమైనా నేర్చుకుంటారో లేదో చూడాలి.