వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ ను హిట్ అండ్ రన్ కేసు నుంచి తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే అప్పల రాజును అరెస్టు చేసేందుకు పోలీసులు కాశీబుగ్గలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అప్పల రాజు ఇంటి దగ్గరకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు అప్పలరాజును పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
కొద్ది రోజుల క్రితం సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ అతివేగంగా బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్యను గుద్దాడు. ఆ ప్రమాదంలో దానయ్య చనిపోయాడు. అయితే, బైక్ నడిపింది ఆరవ్ కాదని, ఆరవ్ స్నేహితుడు సిద్దార్థ అని నమ్మించేందుకు అప్పలరాజు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆరవ్ ను తప్పించేందుకు సాయపడ్డారని ఆరోపణలు రావడంతో స్థానిక ఎస్ ఐని కూడా సస్పెండ్ చేశారు.
అంతేకాదు, బాధిత కుటుంబానికి డబ్బులిచ్చి ప్రలోభపెట్టాలని చూశారని కూడా అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. ప్రమాదానికి కారణమైన బైకును కూడా మాయం చేసి నేరాన్ని కప్పిపుచ్చారని అప్పలరాజుపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద అప్పలరాజుపై కేసులు నమోదయ్యాయి.
అంతకుముందు, ఆరవ్ అరెస్టుపై జగన్ స్పందించిన తీరు విమర్శలపాలైన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల చిన్న పిల్లాడు తెలిసీతెలియక యాక్సిడెంట్ చేస్తే హోమీసైడ్ సెక్షన్ల కింద మర్డర్ కేసు పెడతారా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలపాలయ్యాయి. క్లియర్ గా ఆరవ్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. అయినప్పటికీ, అప్పలరాజుపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే ఆరవ్ పై హోమీసైడ్ సెక్షన్ల కింద మర్డర్ కేసు నమోదు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
