కిడ్నాప్ ఎపిసోడ్ పై భూమా అఖిల సోదరి కీలక వ్యాఖ్యలు

భూవివాదానికి సంబంధించి సీఎం కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉండటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అఖిలప్రియ సోదరి ఈ ఇష్యూ మీద మాట్లాడారు. తాము ఎవర్నీ డబ్బులకోసం డిమాండ్ చేయలేదన్న ఆమె.. రిమాండ్ రిపోర్టులో ఉన్న విషయాలు సరికావన్నారు.

హైదరాబాద్ లో తమకు భద్రత లేదన్నారు. వేరే రాష్ట్రం వాళ్లం కాబట్టి.. తమ పట్ల పోలీసులు మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. కనీస సమాచారం లేకుండా 30నుంచి 40 మంది మగ పోలీసులు ఇంటికి వచ్చారని.. మహిళా పోలీసులు లేకుండా ఏ విధంగా వస్తారని ప్రశ్నించారు. మూడు నెలలుగా తన సోదరి ఆరోగ్యం బాగోలేదన్న ఆమె.. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయన్నారు.

గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా ఫిట్ గా ఉందంటూ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. అఖిల విషయంలో ఎందుకలా వ్యవహరిస్తున్నారో తనకు తెలీటం లేదన్న భూమా మౌనిక ఈ ఇష్యూపై కూర్చొని మాట్లాడటానికి తాము సిద్ధమన్నారు. తమ వాటాల గురించి గతంలో తాము మాట్లాడామని.. ఎప్పుడూ ఎవరిని డబ్బుల కోసం డిమాండ్ చేయలేదన్నారు.

అక్క అఖిల అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చన్న అనుమానాన్నివ్యక్తం చేసిన ఆమె.. తన తండ్రికి చాలామందితో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయన్నారు. ‘మా నాన్న అకస్మాత్తుగా మరణించటంతో మా ఆస్తులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలీదు. మా నాన్నకు చాలామందివ్యాపార భాగస్వాములు ఉన్నారు. మా వాటాల కోసం గతంలో మేం వాళ్లతో మాట్లాడాం. అక్క కోసం నేను.. తమ్ముడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. కొట్టుకునేంత సీన్ ఇప్పుడు ఎవరికి లేదు. ఎవరైనా పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. మరి.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే పెద్ద మనిషి ఎవరబ్బా?